'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోందని మరోసారి హెచ్చరించారు. తాను గతంలో రచించిన ‘రిచ్ డాడ్స్ ప్రాఫెసీ’ (Rich Dad's Prophecy) పుస్తకంలోనే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఆ పుస్తకంలోని సూచనలను అనుసరించిన వారు ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నారని తెలిపారు.
ఇప్పటికీ ఆలస్యం కాలేదని, తమ ఆర్థిక నిర్ణయాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని కియోసాకి తనను అనుసరించేవారికి సూచించారు. ప్రతి ఆర్థిక పతనంలో ఎంతోమంది తమ సంపదను కోల్పోతారని, అదే సమయంలో కొందరు మాత్రం సరైన వ్యూహాలతో మరింత ధనవంతులవుతారని చెప్పారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ (X) పోస్టులో పేర్కొన్నారు.
తనను ఎక్స్లో అనుసరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపిన కియోసాకి, ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తన సందేశాన్ని ముగించారు. ఈ పోస్టు మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వ్యూహాలపై చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా కియోసాకి పలుమార్లు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2026–27 కాలంలో ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని కూడా ఇటీవల పేర్కొన్నారు.
REPEATING: Global economy is crashing.
I predicted this in my book Rich Dad’s Prophecy.
Those that followed the guidance in that book are OK today.
Please remember, it’s not too late to make changes now.
Please remember in every crash many people are wiped out and a few…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 22, 2026


