పశ్చిమాసియాలో క్రూడాయిల్ సంక్షోభం మరింత ప్రమాదకర మలుపు తిరిగింది. అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా సైనిక చర్యల కారణంగా తమ చమురు ఎగుమతులకు అడ్డంకులు కలిగిస్తే ఆ ప్రాంతం నుంచి చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘మమ్మల్ని చమురు అమ్మకుండా నిరోధిస్తే.. ఈ ప్రాంతంలో ఏ ఒక్క దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వం’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ చేసిన ప్రకటనతో గ్లోబల్ ఇంధన మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి.
అమెరికాతో సాగుతున్న సైనిక ఘర్షణలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత స్పష్టంగా ఉందని గాలిబాఫ్ తెలిపారు. తమ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే పశ్చిమాసియాలోని చమురు మౌలిక వసతులను, సరఫరా మార్గాలను స్తంభింపజేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి భద్రతపై అమెరికా దళాల ఉనికి తీవ్రంగా ఖండించారు. ఇరాన్ భద్రతా ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే వరకు ఈ జలసంధిలో పూర్వ పరిస్థితులు నెలకొనవని చెప్పారు.
ముదురుతున్న ఉద్రిక్తతలు.. వ్యూహాత్మక దాడులు
ఒకవైపు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు ఉధృతం చేస్తామని అమెరికా హెచ్చరిస్తుండగా.. మరోవైపు దౌత్యపరమైన చర్చలు ఎలాంటి పురోగతి సాధించకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి తోడు ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం, ఇంధన రవాణాకు మరో కీలకమైన ప్రాంతంలో కొత్త ఆటంకాలను సృష్టిస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు
ఇరాన్ వ్యూహాత్మక హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఒకవేళ హార్మూజ్ జలసంధిలో సరఫరాకు విఘాతం కలిగితే గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సైనిక దాడుల కంటే ముందే దౌత్య మార్గాల ద్వారా ఈ సంక్షోభానికి తెరదించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


