ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా సహాయాన్ని కోరింది. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, పాకిస్థాన్ అమెరికా నుండి 10 బిలియన్ (రూ. 96,536 కోట్ల) డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని కోరినట్లు రాయిటర్స్ కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ దౌత్యపరమైన క్రెడిట్ను ఉపయోగించుకుని, ఇప్పుడు వాషింగ్టన్ నుండి ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక ఈ 10 బిలియన్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపితే, అది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సంజీవనిలా మారుతుంది.
దీనివల్ల పాకిస్థాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. యూఎస్ డాలర్తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోకుండా స్థిరపడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అయితే,ఈ విన్నపంపై అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ ప్రభుత్వం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కానీ, పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్తో భేటీ అయినప్పుడు.. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దెబ్బతింటుందో వివరించినట్లు పాక్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఐఎంఎఫ్ నుండి పొందిన 7 బిలియన్ల ప్యాకేజీ కింద కొనసాగుతోంది. ఈ లోన్ పొందడం కోసం పాక్ ప్రభుత్వం ప్రజలపై భారీగా పన్నులు పెంచడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం వంటి కఠినమైన సంస్కరణలను అమలు చేస్తోంది.
2023లో ఒక దశలో పాకిస్థాన్ దేశం పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి రాగా, అప్పట్లో ఐఎంఎఫ్ ఇచ్చిన మూడు బిలియన్ల అత్యవసర నిధులు కాపాడాయి. ఆ తర్వాత వాతావరణ మార్పుల తట్టుకునేందుకు మరో 1.3 బిలియన్ల లోన్ కూడా పొందింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, చైనా, సౌదీ అరేబియాలు ఇచ్చే అప్పులపైనే పాకిస్థాన్ విదేశీ నిల్వలు ఆధారపడి ఉన్నాయి.
అసలు ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి?
ఇది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తన ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అందించే చాలా అరుదైన ఆర్థిక ప్యాకేజీ. ఏదైనా మిత్రదేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దాని కరెన్సీని కాపాడటానికి, డాలర్ ఫండింగ్ లేదా గ్యారెంటీల రూపంలో అమెరికా ఈ సహాయాన్ని అందిస్తుంది. గతంలో 2002లో ఉరుగ్వే దేశానికి, 2025లో అర్జెంటీనా దేశానికి అమెరికా ఇటువంటి ప్యాకేజీలను ప్రకటించింది.


