టెహ్రాన్: హర్మూజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అన్వేషణ వైపు మళ్లిస్తున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇరాన్కు ఉన్న వ్యూహాత్మక ఆధిపత్యం నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఒమన్ తదితర దేశాలు పైప్లైన్లు, రైల్వేలు, కొత్త పోర్టుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.
సాధారణ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి మీదుగా రోజుకు 100 నుంచి 150 నౌకలు ప్రయాణిస్తూ ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువు, ఆహార పదార్థాలు, ఇతర సరుకులను రవాణా చేస్తుంటాయి. అయితే ఇరాన్తో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, సముద్ర భద్రతపై నెలకొన్న ఆందోళనల కారణంగా ఈ మార్గంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో గల్ఫ్ దేశాలకు స్పష్టమైంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎగుమతులు కొనసాగించే దిశగా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి.
సౌదీ అరేబియా ప్రత్యేక వ్యూహం
సౌదీకి తూర్పున పర్షియన్ గల్ఫ్, పశ్చిమాన ఎర్ర సముద్రం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల నుంచి చమురును పెట్రోలైన్ ద్వారా యాంబూ పోర్టుకు తరలిస్తోంది. అలాగే జెద్దా–దమ్మామ్ మధ్య సుమారు 7 బిలియన్ డాలర్లతో రైల్వే, హైవే ప్రాజెక్టులను చేపడుతోంది.
ఫుజైరాపై యూఏఈ దృష్టి
దుబాయ్, అబుదాబి పోర్టులు హార్మూజ్ లోపల ఉండటంతో యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే హార్మూజ్ వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఉన్న ఫుజైరా, కోర్ఫక్కన్ పోర్టులను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. 2027 నాటికి రెండో ఈస్ట్-టు-వెస్ట్ ఆయిల్ పైప్లైన్ను పూర్తి చేసి ఫుజైరా ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఒమన్కు భౌగోళిక ప్రయోజనం
సోహార్, దుఖ్మ్, సలాలా పోర్టులు హార్మూజ్ వెలుపల ఉండటంతో ఒమన్కు సహజంగానే వ్యూహాత్మక ప్రయోజనం ఉంది. అయితే సౌదీ, యూఏఈతో పోలిస్తే పరిమిత ఆర్థిక వనరుల కారణంగా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే అవకాశం తక్కువగా ఉంది.
ఖతార్, కువైట్కు సవాళ్లు
ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు పూర్తిగా హార్మూజ్పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా సౌదీ లేదా యూఏఈ భూభాగం గుండా పైప్లైన్ నిర్మించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఖతార్పై విధించిన దిగ్బంధనం కారణంగా పొరుగు దేశాలపై పూర్తి స్థాయి విశ్వాసం నెలకొనలేదు.
కువైట్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సౌదీ మార్గాన్ని వినియోగిస్తే ఆర్థిక ఆధారపడటం పెరుగుతుందనే ఆందోళన ఉంది. మరోవైపు ఇరాక్ మార్గంలో భద్రతా సమస్యలు ప్రత్యామ్నాయ ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి.
ప్రాజెక్టులు ఉన్నా.. అమలులో సవాళ్లు
ఇరాక్ కారిడార్, హిజాజ్ రైల్వే పునరుద్ధరణ, ఇండియా–యూఏఈ–ఒమన్ సముద్రగర్భ పైప్లైన్ వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటి అమలుకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. హార్మూజ్ సాధారణ స్థితికి వస్తే భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్రాజెక్టుల అవసరం తగ్గే అవకాశం ఉంది. పైప్లైన్లు కూడా దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సముద్ర మార్గాల ద్వారా జరిగే భారీ స్థాయి చమురు రవాణాను రైళ్లు, ట్రక్కులు లేదా పైప్లైన్లు పూర్తిగా భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.
అత్యవసర పరిస్థితుల కోసమే ప్రత్యామ్నాయాలు
గల్ఫ్ దేశాలు చేపడుతున్న ఈ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల లక్ష్యం హార్మూజ్ జలసంధిని పూర్తిగా పక్కన పెట్టడం కాదని, అత్యవసర పరిస్థితుల్లో కొంతకాలం ఎగుమతులు కొనసాగించే సామర్థ్యాన్ని పెంచుకోవడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే నిధులతో పాటు ప్రాంతీయ రాజకీయ విశ్వాసం, స్థిరత్వం కూడా కీలకమని అభిప్రాయపడుతున్నారు.


