సముద్రం మీదుగా వెళ్లే ప్రతి చమురు బొట్టుతోపాటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ప్రాంతమే పర్షియన్ గల్ఫ్..! జపాన్ నుంచి పశ్చిమ ఐరోపా దేశాల వరకు తమ ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఆధారపడతాయి. అలాంటి గల్ఫ్ ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంటే.. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఆయిల్ సరఫరాలు నిలిచిపోతుంటే.. జపాన్, ఐరోపా వంటి మిత్రదేశాలు అమెరికాకు ఈ యుద్ధంలో సైనిక సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు..?
ఈ యుద్ధంలో అమెరికా ఎందుకు ఏకాకిగా మిగిలిపోయింది..? దీని వెనుక దశాబ్దాల నాటి డీప్ జియోపాలిటిక్స్, దౌత్యపరమైన తప్పిదాలు, తెరవెనుక జరిగిన ఒక పెద్ద రాజకీయ గేమ్ ఉందంటే మీరు నమ్ముతారా..? జపాన్, ఐరోపా దేశాలు గల్ఫ్ ప్రాంతానికి తమ నేవీ నౌకలను పంపి సహాయం చేద్దామన్నా, వాళ్ల దగ్గర అసలు ఆ స్థాయి 'లాంగ్ రేంజ్' యుద్ధనౌకలే లేవు..! రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచ దేశాలతో అమెరికా ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.
‘‘ప్రపంచ సముద్ర మార్గాలను మేమే పారడోల్ చేస్తాం, మీకు రక్షణ ఇస్తాం. కానీ దానికి ప్రతిఫలంగా మీ సైనిక, రక్షణ విధానాలను మేమే నియంత్రిస్తాం..!’’ అని అమెరికా చెప్పింది. ఎందుకంటే, ఆయా దేశాలు మళ్లీ పెద్ద నావికాదళాలను నిర్మిస్తే.. అమెరికాకు ఎదురుతిరుగుతాయేమోనన్న ఒక భయం..! అందుకే ఒక్క జపాన్, సామ్రాజ్యవాద చరిత్ర ఉన్న బ్రిటన్, స్వతంత్రంగా ఉండే ఫ్రాన్స్ తప్ప.. ప్రపంచంలో ఏ దేశానికి సుదూర ప్రాంతాలకు వెళ్లి యుద్ధం చేసే అంటే.. Power Projection నావికాదళాలు లేనేలేవు! మిగతా దేశాల ఓడలన్నీ కేవలం తమ సొంత తీరాలను కాపాడుకునే 'కోస్టల్ పెట్రోల్' బోట్లు మాత్రమే. ఒకవేళ ఏదైనా సుదూర యుద్ధ నౌక ఉన్నా.. అది డాక్లోనే ఉంటుంది. దాన్ని యుద్ధానికి సిద్ధం చేసి గల్ఫ్కు పంపడానికి నెలల సమయం పడుతుంది!
ట్రంప్ ముందు ప్రతిపాదన
ఇక రెండో కారణాన్ని విశ్లేషించుకుందాం..! ఫిబ్రవరి 11న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. నెతన్యాహు ట్రంప్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేయొచ్చు. కేవలం 4 రోజుల్లో ఈ యుద్ధం ముగిసిపోతుంది..! ఇరాన్ నాయకుల సమాచారం మా దగ్గర ఉంది. అక్కడ విప్లవం వచ్చి, ఇరాన్ రాజధాని పేరు 'ట్రంపోపోలిస్'గా మారుతుంది. మీకంటే ధైర్యవంతుడైన ప్రెసిడెంట్ చరిత్రలోనే ఉండరు..!’’ అంటూ.. ట్రంప్ను నెతన్యాహు ఆకాశానికెత్తేశారు..! ఈ సమావేశం జరిగినప్పుడు ఆ గదిలోనే ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వంటి నిపుణులందరూ ట్రంప్ను వారించారు.
‘‘మిస్టర్ ప్రెసిడెంట్, ఇది అత్యంత భయంకరమైన ఆలోచన..! నెతన్యాహు 30 ఏళ్లుగా ఇదే మాట చెబుతూ.. తన యుద్ధాన్ని అమెరికాతో బలవంతంగా చేయించాలని చూస్తున్నారు. ఈ యుద్ధం జరిగితే గల్ఫ్ నాశనమవుతుంది’’ అని తీవ్రంగా హెచ్చరించారు. కానీ విదేశాంగ విధానం గురించి ఏమీ తెలియని మిలిటరీ మంత్రులు మాత్రం.. ‘‘యుద్ధమే కదా?? చేసేయండి..’’ అని తాపీగా చెప్పేశారు. దాంతో.. వెనువెంటనే కార్బన్ షిప్లు, నౌకలు గల్ఫ్ వైపు బయలుదేరాయి..! యుద్ధానికి వెళ్లేముందు అమెరికా సాధారణంగా తమ మిత్రదేశాలైన జపాన్, బ్రిటన్లతోపాటు.. నాటోతో రహస్య సమాచారాన్ని పంచుకుంటుంది. కానీ.. ఈసారి మాత్రం ఎలాంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ జరగలేదు..!
ఐరోపా దేశాలు, జపాన్పై అమెరికా ఆగ్రహం
ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు.. పర్షియన్ గల్ఫ్లోని ప్రతి చమురు శుద్ధి కర్మాగారాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బూడిద చేయగలవు..! స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్లే ప్రతి నౌకను ఇరాన్ సులువుగా టార్గెట్ చేయగలదు. ఇప్పటికే ఈ అంశాలు ఈ యుద్ధంలో రూఢీఅయ్యాయి. అమెరికా యుద్ధనౌకలు కూడా గల్ఫ్లో కదలకుండా నిలబడితే.. అంటే లంగర్ వేసినట్లుగా స్టేబుల్గా ఉంటే.. ఇరాన్ క్షిపణులకు ఈజీ టార్గెట్గా మారిపోతాయని తేలిపోయింది. నాలుగు రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం అలా కొనసాగుతుండడంతో.. ట్రంప్ ప్రభుత్వం కంగారుపడి.. ఐరోపా దేశాలు, జపాన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘మీ సైన్యాలను పంపండి..!’’ అంటూ గగ్గోలు పెట్టింది..! కానీ ఆలోచించండి.. ఒకవైపు ‘‘మీరు నౌకాదళాలను అభివృద్ధి చేసుకోవద్దు..’’ అని దశాబ్దాలుగా చెప్పిన అమెరికా, ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ‘‘సైన్యాన్ని పంపండి’’ అంటే వాళ్లు ఎక్కడి నుంచి తెస్తారు..? పైగా, తమకు తెలియకుండా, తమ ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసే ఒక యుద్ధంలోకి.. మిత్రదేశాలు ఎందుకు దూకుతాయి..? అందుకే ఐరోపా, జపాన్ ఈ యుద్ధంలో అస్సలు పాల్గొనదలచుకోలేదని తెలుస్తోంది..!
సమస్యలకు పరిష్కార మార్గం ఏది?
ఈ యుద్ధంలో ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే.. సమస్య పరిష్కారానికి అస్సలు చర్చలు జరగడం లేదు. దౌత్యపరమైన ప్రయత్నాల ఊసే లేదు. నామ్కే వాస్తేగా కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుంటున్నా.. అవి ఏకపక్షంగా ఉంటున్నాయి. అమెరికా ఈ యుద్ధంతో ప్రపంచానికి కేవలం యుద్ధాన్ని కొనసాగించేందుకు వనరులను సమకూర్చుకోవడానికే కాల్పుల విరమణ అనే పరిస్థితిని పరిచయం చేసింది. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ సంక్షోభం వచ్చినప్పుడు.. అగ్ర నాయకులు మాట్లాడటానికి ముందే, 'టెక్నికల్ టీమ్లు' రహస్య చర్చలు జరిపి, కాంట్రాక్ట్లను సిద్ధం చేస్తాయి.
కానీ ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో తన స్టేట్ డిపార్ట్మెంట్ నిపుణులను, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ను పూర్తిగా పక్కన పెట్టింది..! ట్రంప్ పంపిన జారెడ్ కుష్నర్ వంటి ప్రైవేట్ రాయబారులు చర్చల కోసం ఖతార్ రాజధాని 'దోహా' వెళ్లినప్పుడు.. ఇరాన్ ప్రతినిధులు ముఖం మీదే చెప్పారు.. ఏమని అంటే.. ‘‘ఈ వారం మీతో మాట్లాడటానికి ఏమీ లేదు! ముందు సరిగ్గా టెక్నికల్ చర్చలు జరపండి..!’’ అనేది దాని సారాంశం. దాంతో ఆ రాయబారులు వెనక్కి వెళ్లక తప్పలేదు..! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు అమెరికా-ఇరాన్ మధ్య అసలైన 'టెక్నికల్ టాక్స్' జరగనే లేదనేది బహిరంగ రహస్యం..!
సో ఫైనల్గా చెప్పాలంటే.. జపాన్తోపాటు, ఐరోపా దేశాలు గల్ఫ్కు రాకపోవడానికి కారణం వాళ్ల స్వార్థం కాదు.. అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతోపాటు.. ట్రంప్ అహంకారమే..! మిత్రదేశాల సలహాలను పక్కన పెట్టి, కేవలం అబద్ధాలు చెప్పి, మభ్యపెట్టే వాళ్ల మాటలు విని యుద్ధానికి దిగితే.. ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గల్ఫ్ సంక్షోభం ప్రపంచానికి నిరూపించింది. ఇప్పుడు ఈ ఇంధన సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ఒక పెద్ద మందగమనం అంటే.. Depression వైపు వెళ్తోంది..!
- హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు.


