కృత్రిమ మేధస్సు (AI), డీప్ఫేక్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దేశంలోని కంపెనీలు, పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా "బాస్ స్కామ్" పేరుతో పెరుగుతున్న కొత్త తరహా మోసాలపై శుక్రవారం సెబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.
సెబీ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు AI సాయంతో కంపెనీల సీఎండీలు, సీఈఓలు లేదా ఇతర ఉన్నతాధికారుల గొంతును క్లోన్ చేయడం, డీప్ఫేక్ వీడియోలు రూపొందించడం, అలాగే ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా వారిలా నటించి ఫైనాన్స్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. "అత్యవసరం", "రహస్యంగా ఉంచాలి" అంటూ వెంటనే నిధులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చి కోట్ల రూపాయలు కాజేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని సెబీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలు పంపుతున్నట్లు కూడా వెల్లడించింది.
ఇదే సమయంలో ఎన్ఎస్ఈ కూడా పెట్టుబడిదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఎన్ఎస్ఈ వెబ్సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్లు, సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపులు, తప్పుడు స్టాక్ సిఫార్సుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ సేవలను ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దని, OTPలు లేదా లాగిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.


