నెలాఖరు తర్వాత జీతం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వేతనాల కోడ్ (Code on Wages), 2019 కీలక రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యతను యజమానులపై స్పష్టంగా విధించింది. ముఖ్యంగా జీతం ఆలస్యం చేయడం, అనుమతి లేకుండా కోతలు విధించడం వంటి అంశాలపై ఉద్యోగులు నేరుగా అధికారులను ఆశ్రయించే అవకాశం కల్పించింది. ఈ నిబంధనల ఉద్దేశం ఉద్యోగులకు వేతన భద్రత కల్పించడంతో పాటు యజమానుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం.
అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వేతనాల కోడ్, 2019 చట్టం ఆమోదం పొందినప్పటికీ, దాని పూర్తి అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు అమలు చేసిన తర్వాతే పూర్తిగా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2026లో తుది నిబంధనలను నోటిఫై చేసినప్పటికీ, అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలు కాలేదు. కాబట్టి ఉద్యోగి పనిచేస్తున్న రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
జీతం ఎప్పటిలోపు చెల్లించాలి?
వేతనాల కోడ్ ప్రకారం నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు తదుపరి నెల 7వ తేదీలోపు జీతం చెల్లించాలి. రోజువారీ వేతన కార్మికులకు షిఫ్ట్ ముగిసిన వెంటనే, వారపు వేతన ఉద్యోగులకు వారాంతపు సెలవుకు ముందే వేతనం ఇవ్వాలి. పక్షం రోజుల ప్రాతిపదికన పనిచేసేవారికి ఆ కాలం ముగిసిన రెండు రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగం మానేసినా.. రెండు రోజుల్లో సెటిల్మెంట్
రాజీనామా చేసినా, ఉద్యోగం నుంచి తొలగించినా లేదా సేవలు రద్దు చేసినా ఉద్యోగి తుది బకాయిలను రెండు పని దినాల్లోపు చెల్లించాలని కోడ్ పేర్కొంటుంది. గతంలో నెలల తరబడి ఫైనల్ సెటిల్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులకు ఇది కొంతవరకు చెక్ పెట్టే నిబంధనగా భావిస్తున్నారు.
అందరికీ వర్తింపు
పాత వేతన చెల్లింపుల చట్టం (Payment of Wages Act, 1936) కింద నిర్దిష్ట వేతన పరిమితిలో ఉన్న ఉద్యోగులకే కొన్ని రక్షణలు ఉండేవి. కానీ కొత్త కోడ్ ప్రకారం జీతం ఎంత ఉన్నా ఉద్యోగులందరికీ సమాన రక్షణ ఉంటుంది. దీంతో సీనియర్ మేనేజ్మెంట్, అధిక వేతన ఉద్యోగులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు.
జీతం ఆలస్యమైతే ఏం చేయాలి?
యజమాని జీతం నిలిపివేసినా, ఆలస్యం చేసినా లేదా అనుమతి లేని కోతలు విధించినా ఉద్యోగి ‘ఇన్స్పెక్టర్-కమ్-ఫెసిలిటేటర్’ను సంప్రదించవచ్చు. ఈ అధికారి ముందుగా ఇరు పక్షాల మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. పరిష్కారం లభించకపోతే కేసును ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
ఇతర ముఖ్యమైన నిబంధనలు
ఉద్యోగులకు వేతనం చెల్లించే సమయంలో ఫిజికల్ లేదా ఎలక్ట్రానిక్ పే స్లిప్ ఇవ్వాలని నిబంధనలు సూచిస్తున్నాయి. అలాగే చట్టం అనుమతించిన కోతలకే అవకాశం ఉంటుంది. ఉద్యోగి వేతనానికి సంబంధించిన క్లెయిమ్లను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను యజమాని పాటించకపోతే, బకాయిలను భూ ఆదాయ బకాయిల మాదిరిగా వసూలు చేసే అధికారాన్ని కూడా చట్టం కల్పిస్తోంది.


