టీచర్లకు ఏఐ పాఠాలు | Training on AI for government teachers in the state | Sakshi
Sakshi News home page

టీచర్లకు ఏఐ పాఠాలు

Jul 18 2026 4:22 AM | Updated on Jul 18 2026 4:22 AM

Training on AI for government teachers in the state

బోధనలో నాణ్యత, విద్యార్థుల అభ్యసననుమెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు 

ప్రతి సబ్జెక్టుకూ అనుగుణంగా ప్రాక్టికల్‌వర్క్‌షాపులు, ప్రాజెక్టుల నిర్వహణకు యోచన 

రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా 3 దశల్లో క్లాసులు.. ఏఐ పాఠాలు అర్థం కావట్లేదంటున్న కొందరు టీచర్లు 

సందేహాల నివృత్తికి నిపుణుల తోడ్పాటు అవసరమని మరికొందరి అభిప్రాయం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచడం, విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ వినియోగంపై వారికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను మూడు దశల్లో అందించనుంది. టీచర్ల నుంచే రాష్ట్ర స్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌ను ఎంపిక చేసి వారికి ముందుగా శిక్షణ ఇచ్చింది. 

అలాగే జిల్లా స్థాయిలో మరికొందరు టీచర్లను ఎంపిక చేసి వారికి రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తోంది. మండల స్థాయిలో ఇంకొందరిని ఎంపిక చేసి వారికి జిల్లా రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా శిక్షణ అందించనుంది. వారు మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల టీచర్లకు శిక్షణ అందించనున్నారు. జూలై 2 నుంచి మొదలైన రాష్ట్ర స్థాయి శిక్షణ 25 వరకూ కొనసాగుతుండగా ఈ నెల 8 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో, ఈ నెల 20 నుంచి 25 వరకు మండల స్థాయిలో శిక్షణ ఉండనుంది. 

ప్రాథమిక అంశాలపై అవగాహన.. 
ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, జనరేటివ్‌ ఏఐ వంటి ఆధునిక సాంకేతికల్లోని ప్రాథమిక అంశాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, వర్క్‌షీట్లు, ప్రజెంటేషన్లు రూపొందించడంలో ఏఐ వినియోగాన్ని వివరిస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుగుణంగా ఏఐ ఆధారిత బోధన పద్ధతులను నేర్పిస్తున్నారు. చాట్‌ జీపీటీ వంటి సాధనాల పరిమితులు, తప్పుదోవ పట్టించే సమాచారంపై అప్రమత్తం చేసే నైపుణ్యం శిక్షణలో భాగమవుతోంది. విద్యార్థుల డేటా గోప్యత, ఏఐ వినియోగంలో నైతిక విలువలు, బాధ్యతాయుత వినియోగంపైనా శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. ప్రతి సబ్జెక్టుకూ అనుగుణంగా ఏఐ వినియోగంపై ప్రాక్టికల్‌ వర్క్‌షాపులు, ప్రాజెక్టులు చేయించాలని ప్రతిపాదించారు. 

సమస్యలెన్నో 
ఏఐపై శిక్షణలో అనేక సమస్యలను టీచర్లు లేవనెత్తుతున్నారు. రిసోర్స్‌ పర్సన్స్‌గా ఎంపికైన టీచర్లు చెబుతున్న ఏఐ బోధనాంశాలు అర్థం కావట్లేదని ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలకు చెందిన కొంత మంది టీచర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ఉపాధ్యాయుల్లో చాలా మందికి ఏఐ టూల్స్, డిజిటల్‌ ప్లాట్‌ఫారాల వినియోగంపై తగిన అనుభవం లేనందున శిక్షణపై ఆసక్తి చూపట్లేదు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు పరిమితంగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ శిక్షణ వల్ల ఉపయోగం ఏమిటని మరికొందరు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఏఐ సాధనాలన్నీ ఆంగ్లంలోనే ఉండటం వల్ల తెలుగు మాధ్యమ ఉపాధ్యాయులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానోపాధాయులు, కొందరు టీచర్లకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. దీంతో ఏఐ శిక్షణపై సమయం కేటాయించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. పాఠ్య ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, తరగతి గదిలో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష సాధన ఉండాలని కోరుతున్నారు. ఏఐ టెక్నాలజీ రోజుకో రీతిగా మారుతోంది. ఒక్కసారి శిక్షణ ఇచ్చేస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఏఐపై వచ్చే సందేహాలు నివృత్తి చేయడానికి నిపుణుల తోడ్పాటు అవసరమంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement