సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, వర్గపోరుపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిసారించింది. రాబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే నాయకుల మధ్య సమన్వయం తప్పనిసరని భావించింది.
ఈ నేపథ్యంలో విభేదాలు ఉన్న ఏ ఇద్దరు నేతల మధ్యనైనా సరే సయోధ్య కుదిర్చే బాధ్యతను హైకమాండ్.. రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కు అప్పగించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
అభయ్ పాటిల్ నిన్న ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్లతో ప్రత్యేకంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఇద్దరు నేతలను ముఖాముఖి కూర్చోబెట్టి, విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని స్పష్టం చేస్తూ ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. బండి, ఈటల భేటీ ముగిసిన వెంటనే అభయ్ పాటిల్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తోనూ భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
రాష్ట్ర పార్టీలో ఇంకా సెట్ చేయాల్సిన అంశాలపై అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా చర్చిస్తున్నారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారం, తెలంగాణ బీజేపీలో ఏ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెనువెంటనే పరిష్కరించి ఏకతాటిపైకి తెచ్చేలా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు.


