రాత్రికి రాత్రే మారిన రోడ్లు.. పెట్రోల్‌ కార్లకు నో ఎంట్రీ! | Overnight EV Shift, How Small Nation Laos Put Petrol And Diesel Cars On Pause To Accelerate An Electric Future | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే మారిన రోడ్లు.. పెట్రోల్‌ కార్లకు నో ఎంట్రీ!

Jul 24 2026 8:29 AM | Updated on Jul 24 2026 9:22 AM

Overnight EV Shift: How a Small Nation Laos Put Petrol Cars on Pause

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగం వేగంగా మారుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు (EV) దూసుకొస్తున్నాయి. అయితే ఈ మార్పును వేగవంతం చేసే విషయంలో ఓ చిన్న దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. దక్షిణాసియాలోని లావోస్‌.. కొత్త పెట్రోల్‌, డీజిల్‌ ప్యాసింజర్‌ కార్ల దిగుమతులకు బ్రేక్‌ వేసి ఈవీల వైపు భారీ అడుగు వేసింది.

లావోస్‌ ఒకేఒక్క నిర్ణయంతో ఆటో రంగంలో కొత్త అధ్యాయానికి తెరతీసినట్లు కనిపిస్తోంది. జూన్‌ 1, 2026 నుంచి కొత్తగా దిగుమతి అయ్యే ప్యాసింజర్‌ వాహనాల్లో ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకే అవకాశం కల్పించింది. దీంతో “రాత్రికి రాత్రే రోడ్లపై మార్పు” అనే చర్చ మొదలైంది. అయితే ఇది పూర్తిస్థాయి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నిషేధం కాదు. ప్రజా రవాణా వాహనాలు, నిర్మాణ రంగ వాహనాలు, ప్రత్యేక అవసరాల వాహనాలకు మినహాయింపులు ఉన్నాయి. ప్రధానంగా కొత్త వ్యక్తిగత కార్ల మార్కెట్‌ను ఈవీల వైపు మళ్లించడమే లక్ష్యం.

పర్యావరణం కంటే ఆర్థిక లెక్కలే కీలకం
లావోస్‌ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కేవలం కాలుష్య నియంత్రణ కాదు. దేశానికి అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు లావోస్‌లో విద్యుత్‌ ఉత్పత్తిలో జలవిద్యుత్‌ వాటా ఎక్కువ. అంటే.. విదేశాల నుంచి చమురు తెప్పించుకోవడం కంటే స్థానికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరమని ప్రభుత్వం భావిస్తోంది.

చిన్న దేశం.. పెద్ద ప్రయోగం
లావోస్‌ జనాభా, వాహన మార్కెట్‌ పరిమాణం భారత్‌తో పోలిస్తే చాలా చిన్నది. అందుకే అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని నేరుగా భారత్‌ వంటి భారీ ఆటో మార్కెట్‌కు వర్తింపజేయడం సాధ్యం కాదు. భారత్‌లో కోట్ల సంఖ్యలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు ఉన్నాయి. రవాణా వ్యవస్థ, ఛార్జింగ్‌ మౌలిక వసతులు, ఉద్యోగాలు, ఆటో పరిశ్రమ వంటి అనేక అంశాలు ఈవీ మార్పులో కీలకం. అందుకే భారత్‌ దశలవారీగా ఈవీలను ప్రోత్సహిస్తోంది. అయితే లావోస్‌ ప్రయోగం ఓ విషయం మాత్రం స్పష్టం చేస్తోంది. ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవాలని భావించే చిన్న దేశాలకు ఈవీలు ఒక వ్యూహాత్మక మార్గంగా మారుతున్నాయి.

చైనా కంపెనీలకు కొత్త అవకాశం?
లావోస్‌ నిర్ణయం వల్ల చైనా ఈవీ తయారీ సంస్థలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తక్కువ ధరలో ఈవీలను అందిస్తున్న చైనా కంపెనీలు చిన్న మార్కెట్లలో వేగంగా విస్తరిస్తున్నాయి.

ప్రపంచానికి సంకేతమా?
లావోస్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోని పెద్ద దేశాలకు కూడా ఓ చర్చను తెరపైకి తెచ్చింది. పెట్రోల్‌ యుగం నుంచి ఈవీ యుగానికి మార్పు కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాదు.. అది శక్తి భద్రత, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన నిర్ణయంగా మారుతోంది. చిన్న దేశమైన లావోస్‌ తీసుకున్న ఈ అడుగు.. భవిష్యత్తులో పెద్ద దేశాలు అనుసరించే మార్గాల్లో ఒకటిగా మారుతుందా? అనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement