అమెరికాలో ఘోరం, ముగ్గురి మృతి
సియాటెల్: అమెరికాలోని సియాటెల్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. ‘బైట్ ఆఫ్ సియాటెల్’పేరుతో ఏటా నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల బాలుడితోపాటు నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూండగా ఈ ఘోరం చోటు చేసుకుందని తెలుస్తోంది.
దుండగుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలింపు ముమ్మరమైంది. తప్పించుకున్న వ్యక్తిని వరి్ణంచే గుర్తులు ఏవీ లేవని సియాటెల్ అసిస్టెంట్ పోలీస్ చీఫ్ టైరోన్ డేవిస్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని ఒకరు 19 ఏళ్ల యువకుడు కాగా, ఇంకొకరు 44 ఏళ్ల పురుషుడని వివరించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తూండగా 56 ఏళ్ల మహిళ మరణించారని తెలిపారు. గాయపడ్డ వారి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.
సియాటెల్లో 1982 నుంచి ఏటా ఈ బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు.మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్కు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యారని అంచనా. మరికొనిన గంటల్లో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది అనగా ఆదివారం సాయంత్రం సుమారు ఆరుగంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకున్నాయి.
సరిగ్గా ఆ క్షణంలో తాము ఒకానొక స్టాల్లో క్రేప్స్ కొనుగోలు చేశామని, కాల్పులు జరుపుతున్న వాళ్లు తనకు దగ్గరగానే ఉన్నారన్న విషయాన్ని గుర్తించి తాను వెంటనే దగ్గర్లోని సియాటెల్ చి్రల్డన్స్ మ్యూజియమ్లోకి పారిపోయి తలదాచుకున్నానని ఫెయిత్ ఆడియా హంటర్ అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. తనతోపాటు చాలామంది పరుగులు పెడుతూ కనిపించారని చెప్పారు.
ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు కూడా కాల్పుల శబ్ధం వినిపించగానే పారిపోయారని, గంటల తరువాత కొందరు పోలీసులు ఏర్పాటు చేసిన హద్దుల వద్ద తచ్చాడుతూ కనిపించారని తెలిసింది. రొబెర్టో రమిరెజ్ అనే ఫుడ్స్టాల్ యజమాని మాట్లాడుతూ ‘‘అవి టపాకాయలు అనుకున్నా. ఇంతలోనే ఎవరో షూటర్ అని అరిచారు. అంతే అక్కడున్న వారందరూ తలో దిక్కుకు పరుగెత్తారు’’అని వివరించారు. కొంతమంది దాక్కుంటే.. కొంతమంది ఒకరిని ఒకరు తోసుకుంటూ కనిపించారు. కొందరు కిందపడిపోయారు. పసిపిల్లల స్ట్రోలర్స్ కూడా కింద పడిపోయాయి అని ఎస్టాన్ వాకనాబో అనే వ్యక్తి తెలిపారు.
శబ్ధం వినిపించగానే అవి కాల్పులేనని తనకు అర్థమైందని, ఆ వెంటనే ప్రియురాలితో కలసి సురక్షిత ప్రాంతానికి పరుగుపెట్టానని చెప్పారు. సంఘటన స్థలాన్ని ఖాళీ చేయించిన పోలీసులు భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు.


