దేశీయ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న మోటారు రవాణాదారులు (స్మాల్ ట్రక్కర్స్) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నిరంతరం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్థిరంగా పడిపోతున్న ఫ్రైట్ ధరల మధ్య ఈ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపిన వివరాల ప్రకారం, దేశీయ సరుకు రవాణాలో 70 శాతం చిన్న ఆపరేటర్లే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక లారీ నిర్వహణ వ్యయంలో కేవలం డీజిల్ ఖర్చులే 55-60 శాతానికి చేరాయి. దీనికితోడు టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, అడ్ బ్లూ (వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన పొగను తగ్గించడానికి ఉపయోగించే ఒక రసాయన ద్రవం), టైర్లు, వాహన ఈఎంఐలు, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయి. మరోవైపు, ఏజెంట్లు (బ్రోకర్లు), డిజిటల్ ఫ్రైట్ ప్లాట్ఫారమ్లపై ఆధారపడటం వల్ల తక్కువ ధరలకే సరుకును రవాణా చేయాల్సి వస్తోంది.
పరిశ్రమను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య డ్రైవర్ల కొరత. ప్రస్తుతం దేశంలో దాదాపు 22 లక్షల మంది కమర్షియల్ డ్రైవర్ల కొరత ఉంది. సుదీర్ఘ ప్రయాణాలు, రహదారులపై సరైన వసతులు లేకపోవడం, తక్కువ ఆదాయం కారణంగా యువత ఈ వైపు రావడం లేదు. ఏఐఎంటీసీ మాజీ అధ్యక్షుడు బాల్ మల్కిత్ సింగ్ ఈ పరిస్థితిపై మాట్లాడుతూ.. ‘సరుకు రవాణా రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్న ఆపరేటర్లు వ్యాపారాలు మూసివేసే ప్రమాదం ఉంది. ఇది దేశ సరఫరా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టోల్ రుసుములను హేతుబద్ధీకరించాలని, సరుకు రవాణా ధరలను నిర్వహణ ఖర్చులతో అనుసంధానించాలని, వాహన్ (Vahan) పోర్టల్లోని లోపాలను సరిచేసి వెహికల్ ట్రాకింగ్ డివైజ్ నిబంధనలను పునపరిశీలించాలని రవాణా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


