''డబ్బును కేవలం దాచుకోవడం కంటే, అది మన కోసం పనిచేసేలా చేయడం ముఖ్యం'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూ.. బ్యాంకులు, రుణ వ్యవస్థ, పెట్టుబడుల ఆలోచనా విధానం గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
మనం బ్యాంకులో డబ్బు జమ చేస్తే.. అది అక్కడే స్థిరంగా ఉండిపోదు. బ్యాంకులు ఆ డిపాజిట్లలో కొంత భాగాన్ని లోన్స్ రూపంలో.. ఇతరులకు ఇస్తాయి. అంటే.. మన డబ్బు బ్యాంకింగ్ వ్యవస్థలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే.. ఆ డబ్బు ద్వారా వచ్చే లాభాల్లో ప్రధాన ప్రయోజనం బ్యాంకులకు.. రుణాలు తీసుకుని వాటిని ఉపయోగించే వారికి ఎక్కువగా వెళ్తుందని కియోసాకి చెబుతున్నారు.
కియోసాకి.. రిచ్ డాడ్, పూర్ డాడ్ భావనను చెబుతూ.. రెండు రకాల ఆలోచనా విధానాలను వివరించారు. సాధారణంగా పూర్ డాడ్ డబ్బును భద్రంగా దాచుకోవడంపై దృష్టి పెట్టే వ్యక్తి. రిచ్ డాడ్.. డబ్బును ఉపయోగించి మరిన్ని ఆస్తులను సృష్టించుకోవాలని చూసే వ్యక్తి అని ఆయన వివరిస్తారు. ఒకరు బ్యాంకులో డబ్బు ఉంచితే.. మరొకరు డబ్బును ఉపయోగించి వ్యాపారాలు లేదా ఆస్తుల్లో పెట్టుబడులుగా పెడతారని చెబుతున్నారు.

ఇక్కడ కియోసాకి చెప్పే విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. బ్యాంకులు డిపాజిట్లను ఉపయోగించి లోన్స్ ఇస్తాయి. లోన్స్ ద్వారా వచ్చే వడ్డీతో బ్యాంకులు ఆదాయం పొందుతాయి. అదే సమయంలో డిపాజిటర్లకు కూడా కొంత వడ్డీ చెల్లిస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న సాధారణ బ్యాంకింగ్ విధానం.
కియోసాకి ప్రకారం.. ఒక తెలివైన పెట్టుబడిదారు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ ఆస్తి ఆదాయం ఎలా ఇస్తుంది?, దాని విలువకు ఆధారం ఏమిటి?, దానిపై ఎంత అప్పు ఉంది?, తన అంచనా తప్పు అని నిరూపించేది ఏమిటి?, అవసరమైతే బయటకు వచ్చే మార్గం ఏమిటి? వంటి అంశాలను పరిశీలించాలి. కేవలం ఎవరో చెప్పారని లేదా ధర పెరుగుతుందని ఆశతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఆయన చెబుతారు. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి అవగాహన, రిస్క్ అంచనా, సరైన ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!


