హత్య కేసులో సాక్షి ఆరోపణ
రూ. లక్షన్నర ఇవ్వాలని వేధిస్తున్నారన్న బాధితుడు
ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో హైకోర్టులో ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: హత్య కేసులో సాక్షినైన తనను డబ్బు కోసం పోలీసులు వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేయడం పోలీసు శాఖలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు సీఐ, ఎస్సై తనను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని, లేదంటే ఒక హత్య కేసులో ఇరికిస్తామంటూ వేధిస్తున్నారని కొలుసు అయ్యప్ప శుక్రవారం మీడియా ఎదుట వాపోయాడు. కొలుసు అయ్యప్ప తన అత్తను మామ కొట్టి చంపిన కేసులో సాక్షిగా ఉన్నాడు. డబ్బు కోసం తనను సీఐ కొట్టాడని, కానిస్టేబుల్ను పలుమార్లు ఇంటికి, పనిచేసే చోటకి పంపించి వేధిస్తున్నారని తెలిపాడు.
తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని, లేదంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ సీఐ, ఎస్ఐ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై తాను సీఐ, ఎస్ఐతో మాట్లాడిన ఆడియో రికార్డులను కృష్ణా జిల్లా ఎస్పీకి అందచేసి ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించానని చెప్పాడు.
పోలీసులు లంచం డిమాండ్ చేసిన ఆడియో రికార్డులను అయ్యప్ప తరపు న్యాయవాది కోర్డుకు సమర్పించాడు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో అయ్యప్ప దొంగతనం చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే మూడు నెలలు అయినా ఇప్పటివరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను న్యాయమూర్తి నిలదీసినట్లు సమాచారం.


