రెండో రోజూ విచారణకు సహకరించని సీఐ నాగరాజు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజును సిట్ అధికారులు రెండో రోజూ విచారించారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లోని సిట్ కార్యాలయంలో ఉ.10 నుంచి సా.5 గంటల వరకూ విచారించారు. రెండో రోజు కూడా నాగరాజు సహకరించలేదని తెలిసింది. అన్ని ప్రశ్నలకు ఆయన మౌనం దాల్చినట్లు సమాచారం. మరోవైపు.. కానిస్టేబుల్ సురేష్, ఆర్ఎంపీ, ఇతర సిబ్బంది నుంచి తీసుకున్న సమాచారం మేరకు సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే, ప్రతీ దానికి ఆయన ఏమీ తెలీదని చెబుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నారని తెలిసింది.
ఈ ప్రశ్నలకు సమాధానం లేదు..
అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు.. ఎవరు తెచ్చారు.. అతన్ని ఎక్కడ ఉంచారు.. ఎలా చనిపోయాడు.. ఎప్పుడు చనిపోయాడు.. ఒకవేళ చనిపోతే మృతదేహాన్ని ఏం చేశారు అనేవి ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విచారణకు ఇంకా ఐదు రోజులే ఉండడంతో గడువు ముగిసేలోపు కేసులో ఏమైనా క్లూ రాబడతారా లేదా అనే సందేహం నెలకొంది.


