ముంబై: ది ఎకనమిక్ టైమ్స్ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్–2026లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ‘ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్–మెగా’పురస్కారాన్ని అందుకుంది. భారతదేశంలోని అతిపెద్ద కుటుంబ ఆధారిత సంస్థల్లో వృద్ధి, సుస్థిర కార్పొరేట్ పాలన, తరతరాల వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించడం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడం నా కల. నా కుమార్తెలు ఆ కలను తమ కలగా స్వీకరించి, నేడు అపోలో హాస్పిటల్స్లా రూపుదిద్దుకున్న ఈ సంస్థను నిర్మించేందుకు తమ జీవితాలను అంకితం చేశారు’’అని పేర్కొన్నారు. ప్రస్తుతం అపోలోను ప్రీతిరెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్), సంగీతారెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్), సునీతారెడ్డి (మేనేజింగ్ డైరెక్టర్), శోభనా కామినేని (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్) సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.


