చంద్రబాబు రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయా..
20 లక్షలు ఉద్యోగాలు.. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నా
ఉద్యోగుల జీతభత్యాలను 110 శాతానికి పెంచేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
96 శాతానికి తెచ్చా.. ఇంకా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నా
అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇవ్వలేం
సాక్షి, అమరావతి: రెండు హామీలు తప్ప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధమాడేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయలేదని చంద్రబాబు అంగీకరించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చానని, కానీ అమలు చేయలేదని చంద్రబాబు చెప్పారు. రెండేళ్ల పాలన–ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్ను సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో మీడియాకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిరుద్యోగ భృతి అమలు చేయకపోయినా ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తున్నామన్నారు.
రెండు హామీలు తప్ప అని చెప్పినా రెండో హామీ ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయా అని ప్రస్తావించలేదు. దానితో పాటు మిగతా హామీల గురించి కూడా చంద్రబాబు మాట్లాడలేదు. ఎప్పటిలాగే రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాలను వివరిస్తూ మరో పక్క గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. సంక్షేమం ఇవ్వండి.. అభివృద్ధి మీ బాధ్యత అనే ధోరణి ప్రజల్లో మారాలన్నారు. ‘‘రోడ్లు వేయండి అంటారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీ బాధ్యత అంటారు.. ఇది కరెక్ట్ కాదు’’ అని చంద్రబాబు అన్నారు.
పీపీపీలో మనమే నెంబర్ 1
రాష్ట్ర ఆదాయం జీతాలకే సరిపోతోందని, కేంద్రం ఇచ్చే నిధులు అప్పులు, వడ్డీలకు పోతోందని, సంక్షేమానికి అప్పులు చేస్తున్నామని సీఎం చెప్పారు. అందుకే పీపీపీ అంటున్నామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో 390 ప్రాజెక్టులను రూ.1.78 లక్షల కోట్లతో చేపడతామన్నారు. ఇందులో మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయని, వీటికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుందన్నారు. పీపీపీ ప్రాజెక్టుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఇక్కడ పీపీపీ వద్దంటారు. భోగాపురం మాదే అంటారు. అర్ధం చేసుకోకుండా మాట్లాడతారన్నారు. పీపీపీ ప్రాజెక్టుల వల్ల లబ్దిపొందిన వారు కూడా ఆ లబ్దిగురించి మాట్లాడకుండా విమర్శలు చేస్తున్నారని, దేశంలో ఇదే పెద్ద సమస్య అని చంద్రబాబు అన్నారు.
ఎకనమిక్ స్టూడెంట్ని.. ద్రవ్యలోటంటే కాకిలెక్కలే...
ద్రవ్యలోటు పెరిగిందని విలేకరి అడిగిన ప్రశ్నపై సీఎం స్పందిస్తూ నేను ఎకనమిక్ స్టూడెంట్నే, ప్రైమరీ, సెకండరీ డెఫిషిట్ అంటే ఒక మిధ్య ఇవన్నీ మనం అంచనాకు తప్ప కాకిలెక్కలే.. ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. అమరావతికే ఎక్కువ వ్యయం చేస్తున్నారనే విమర్శలపై సీఎం స్పందిస్తూ ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నామని, అయినా ప్రజలు నెగిటివ్గా ఆలోచించి భవిష్యత్ నాశనం చేసుకుంటే ఏమీ చేయలేం అన్నారు. అమరావతి తొలి దశ పనులకు రూ.51,687 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ఇప్పటికే రూ.40,887 కోట్లు టైఅప్ చేశామని, ఇది రూ.70 వేల కోట్లకు పోతుందన్నారు.
రాజధాని తొలి దశ పనులను పూర్తి చేసి 2028లో ప్రధాని చేత ప్రారంభింప చేస్తామన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్ముతామని, తద్వారా డబ్బులు వస్తాయన్నారు. గత రెండేళ్లలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారన్నారు. పీ–4 ద్వారా పేదరిక నిర్మూలనకు ధనవంతులను భాగస్వామ్యం చేస్తున్నామని, 21 లక్షల మంది పేదలను గుర్తించామని, దాతలు ఇప్పటి వరకు 2.40 లక్షల మందిని దత్తత తీసుకున్నారన్నారు. పేద కుటుంబాలను పైకి తెచ్చేలా ఆదేశాలు ఇస్తున్నామన్నారు.
మూడుప్రాంతాల్లో అభివృద్ధికి ప్లాన్ చేశా..
రాష్ట్రంలో మూడు రీజియన్స్ను భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేయడం ద్వారా భారీగా ఉద్యోగాల కల్పనకు ప్లాన్ చేసినట్లు కాగితాలపై గ్రాఫిక్స్ను చంద్రబాబు ప్రదర్శించారు. పోలవరంతో పాటు మిగతా ప్రాజెక్టుల పూర్తికి ప్లాన్ చేశామన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా రాష్ట్ర జీఎస్డీపీని తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఉద్యోగుల జీతభత్యాలను గత ప్రభుత్వం 110 శాతం పెంచేసింది
గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వ్యయాన్ని రాష్ట్ర సొంత పన్నురాబడిలో సగటున 110 శాతానికి పెంచేసిందని చంద్రబాబు తప్పుపట్టారు. అంతకు ముందు 2014–19 మధ్య తన పాలనలో ఉద్యోగుల జీతభత్యాల వ్యయం సొంత పన్ను రాబడిలో సగటున 87 శాతమే ఉందన్నారు. ఇప్పుడు 2024–25, 2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో జీతభత్యాల వ్యయాన్ని 96 శాతానికి తగ్గించామన్నారు. ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. బాధ్యత లేని గత ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వ్యయాన్ని భారీగా పెంచేసిందన్నారు. ఆదాయాలను పెంచుకోవడం ద్వారా ఉద్యోగుల జీతాల వ్యయాన్ని తగ్గిస్తున్నామన్నారు. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇవ్వలేమన్నారు.


