అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చడంపైనా స్పష్టతనివ్వండి
పిటిషనర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: డీఎస్సీ 2025లో చోటు చేసుకున్న భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను అదనపు ఆధారాలుగా తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల బాధితులుగా మారిన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చే విషయంలోనూ స్పష్టతనివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ చంద్రశేఖర్రెడ్డి ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం వాదనలు వినిపించారు. మెగా డీఎస్సీ2025 నియామక ప్రక్రియ మొత్తం భారీ స్థాయి వ్యవస్థాగత కుంభకోణమని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని, పిటిషనర్కు ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కూడా తాము ఎక్కడా దాచిపెట్టలేదని కోర్టుకు వివరించారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బాధిత అభ్యర్థులు ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. డీఎస్సీ అక్రమాలపై ఎవరైనా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరించిందని, ఈ నేపథ్యంలో కోర్టుకొచ్చేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని శ్రీరాం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ ప్రచురించలేదని, దీంతో పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
బాధితులు ఇప్పటికే కోర్టుకొచ్చారు...
ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, డీఎస్సీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్లు పడ్డాయని, ఇందులో 69 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నారు.
రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఎవరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానిస్తూనే డీఎస్సీ అక్రమాలపై మాట్లాడితే సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతామన్న ప్రభుత్వ హెచ్చరికలను తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. అదే రీతిలో బాధిత అభ్యర్థులను ఈ పిల్లో ప్రతివాదులుగా చేర్చే అంశంపైనా స్పష్టతనివ్వాలని పేర్కొంది.


