తల్లిదండ్రులతో కలిసి బ్యాడ్మింటన్ అకాడెమీకి భూమి పూజ చేస్తున్న పీవీ సింధు (ఫైల్)
క్రీడా ప్రాజెక్టునూ వదలని లోకేశ్ ‘క్రెడిట్’ పాలిటిక్స్
పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడెమీకి నేడు మళ్లీ లోకేశ్ భూమి పూజ
2021లో సింధు అకాడెమీకి 3 ఎకరాలు కేటాయించిన అప్పటి సీఎం వైఎస్ జగన్
అప్పట్లో మోకాలడ్డటానికి ప్రయత్నించిన టీడీపీ నేతలు
ఇప్పటికే తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేసిన సింధు.. నిర్మాణమూ ప్రారంభం
బ్యాడ్మింటన్ అకాడెమీ పూర్తయితే జగన్కి క్రెడిట్ వస్తుందని ఓర్వలేకపోతున్న లోకేశ్.. అందుకే మరోసారి భూమి పూజకు నిస్సిగ్గుగా ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: పాత ప్రాజెక్టులకే కొత్త రంగులేసి, వాటిని తామే తెచ్చి నట్లుగా కలరింగ్ ఇచ్చే సీఎం నారా చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేశ్ క్రెడిట్ పిచ్చి పీక్స్కు చేరుతోంది. రంగం ఏదైనా.. ప్రాజెక్టు ఎలాంటిదైనా.. క్రెడిట్ కొట్టేస్తాం.. ఎన్నిసార్లైనా భూమిపూజ చేసేస్తాం.. ఎలాంటి మొహమాటం లేదు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తండ్రీ కొడుకులు. నాలుగు రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించి.. క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు రూ.కోట్లు ఖర్చు చెయ్యగా.. తానేం తక్కువ తినలేదంటూ అదే విశాఖ వేదికగా.. మరో క్రెడిట్ చోరీకి నారా లోకేశ్ సిద్ధమవుతున్నారు.
ఐదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ హయాంలో భూ కేటాయింపులు జరిగిన పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడెమీకి రెండేళ్ల క్రితం భూమి పూజ జరిగి, నిర్మాణమూ మొదలైంది. ఇప్పుడు.. ఆ భూమి పూజ చెల్లదంటూ లోకేశ్ బుదవారం మరోమారు భూమిపూజకు ఏర్పాట్లు చేశారు. తద్వారా ఈ అకాడెమీని తామే తెచ్చినట్లు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు. ఆ కథాకమామీషు ఇదీ..
2021లో వైఎస్ జగన్ హయాంలోనే స్థలం కేటాయింపు..
బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను ఎగురవేసిన క్రీడాకారిణి పీవీ సింధును ప్రోత్సహించేందుకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో బ్యాడ్మింటన్ అకాడెమీ ఏర్పాటుకు హామీ ఇచ్చి ంది. ఆ హామీకి కట్టుబడి 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ తోటగరువులో అత్యంత విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ తర్వాత అకాడెమీ విస్తరణకు మరికొంత భూమి అవసరమని సింధు అభ్యర్థించడంతో.. మరో ఎకరాన్ని అదనంగా ఇచ్చారు.
ఇలా మొత్తం 3 ఎకరాల భూమిలో ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే. అయితే, అకాడెమీ నిర్మాణానికి కొంత ఆలస్యం కావడంతో ఆ స్థలాన్ని జూనియర్ కాలేజీకి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఓ డిమాండ్ తెచ్చి , అకాడెమీకి మోకాలడ్డే ప్రయత్నం చేశారు. 2024 నవంబర్ 7న పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి ‘సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’ పేరుతో బ్యాడ్మింటన్ అకాడెమీ నిర్మాణానికి ఆ స్థలంలో శా్రస్తోక్తంగా భూమి పూజ చేశారు.
క్రెడిట్ కోసమే లోకేశ్ ఆరాటం?
ఈ బ్యాడ్మింటన్ అకాడెమీ నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. కానీ.. ఇప్పుడు కేవలం క్రెడిట్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన ఏర్పాట్లు చేయడంపై క్రీడా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ అకాడెమీ పూర్తయితే వైఎస్ జగన్కే పూర్తి క్రెడిట్ వెళుతుందన్న అక్కసుతోనే మంత్రి లోకేశ్ బుధవారం హడావుడిగా మరోసారి భూమిపూజ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలో స్థలాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు పార్టీ.. ఇప్పుడు క్రెడిట్ కోసం.. అదే స్థలంలో హడావుడి చెయ్యడం హాస్యాస్పదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేసి పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. భూమి పూజకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ జీవీఎంసీ, అధికారులు ఏర్పాట్లు చేస్తుండటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.


