హార్బర్ల నిర్మాణంపై కేంద్రం కీలక వివరాలు
2019–23 మధ్య 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
జువ్వలదిన్నె 98 శాతం పూర్తవగా.. ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం పనులు వేగంగా జరుగుతున్నట్లు వెల్లడి
లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మత్స్యరంగ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.2,328.89 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమలశాఖ మంత్రి రాజీవ్రంజన్ సింగ్ చెప్పారు. లోక్సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద రాష్ట్రానికి రూ.681.38 కోట్ల కేంద్ర వాటా మంజూరు చేయగా, ఇప్పటికే రూ.462.56 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.
ఈ నిధులతో నాలుగు ఫిషింగ్ హార్బర్లు, విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు హయాంలో 2019–23 మధ్య 15 ప్రాజెక్టులు ఆమోదం పొందడం విశేషం. వీటిలో ఏడు ప్రాజెక్టులకు ప్రస్తుతం ప్రభుత్వం షెడ్యూల్ రేట్స్ను పరిశీలిస్తుండగా, రెండు ప్రాజెక్టులు వర్క్ ప్రాసెస్లో ఉన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. మొత్తం వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యరంగంలో పరుగులు పెట్టిందనేది కేంద్రప్రభుత్వ జవాబుతో స్పష్టమవుతోంది.
97.98 పూర్తయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
సాగర్మాల, బ్లూ రివల్యూషన్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకాల కింద చేపడుతున్న పలు ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రమంత్రి వివరించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.288.80 కోట్లతో 2019–20లో ఆమోదం లభించగా, ప్రస్తుతం 97.98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. చివరిదశ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.138.29 కోట్ల వాటాను ఇస్తుండగా, సాగర్మాల పథకంతో సమన్వయంగా అమలు జరుగుతోందని తెలిపారు.
రూ.178.51 కోట్లతో చేపట్టిన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు 53.75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దీన్ని వచ్చే మార్చి 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 400 మెకనైజ్డ్ బోట్ల సామర్థ్యం ఉన్న ఈ హార్బర్లో ఆధునికీకరణ అనంతరం అంతర్జాతీయ ప్రమాణాలతో చేపల దిగుమతి, నిల్వ, వేలం, కోల్డ్చైన్ తదితర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేలమంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.


