మాట్లాడుతున్న ఎంపీలు తనూజా రాణి, గురుమూర్తి, బాబూరావు
భోగాపురం ఎయిర్పోర్టుపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు క్రెడిట్ చోరీ రాజకీయాలు
ఈవ్యవహారంపై పార్లమెంట్లో చర్చించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధం
సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలకు వైఎస్సార్సీపీ ఎంపీల సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: భోగాపురం ఎయిర్పోర్టుకు కర్త, కర్మ, క్రియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే.. ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మీడియాతో మాట్లాడారు. తాను చేయని దానిని చేసినట్లుగా చెప్పుకుంటూ ‘క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పడరాని పాట్లు పడుతున్నారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు.
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించేందుకు తమ అధినేత వైఎస్ జగన్ అక్కర్లేదని, తాము సరిపోతామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం విజయం నాలుగు గ్రామాల రైతుల త్యాగం, స్థానిక ప్రజల సహకారం, జగన్ ప్రభుత్వ కృషి ఫలితమేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రికార్డులను వక్రీకరించి క్రెడిట్ చోరీ చేయాలన్న యత్నాలను ప్రజలు నమ్మరని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పెమ్మసానివి అసత్య వ్యాఖ్యలు
భోగాపురం విమానాశ్రయం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలని ఎంపీ గొల్ల బాబూరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి భూసేకరణ, పునరావాసం (ఆర్అండ్ఆర్), రైతులకు పరిహారం చెల్లింపు వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. 2019 నాటికే 2,200 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం సేకరించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పడం అవాస్తవమని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఖండించారు.
జీఎంఆర్ సంస్థతో ఒప్పందం 2023 జూన్లో కుదిరిందని, అదే ఏడాది అక్టోబర్లో భూమిని సంస్థకు అప్పగించామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలే కోర్టుల్లో కేసులు వేశారన్న పెమ్మసాని వ్యాఖ్యలను గురుమూర్తి తప్పుబట్టారు. బాబు భూ దాహంతో భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులే కోర్టులను ఆశ్రయించారని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కేంద్ర మంత్రి పదవి పొందిన వారికి అమిత ప్రజాదరణ గల వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పెమ్మసానిని ఉద్దేశించి ఎంపీ తనూజారాణి వ్యాఖ్యానించారు.
స్వయనా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడే వైఎస్ జగన్ హయాంలో 86శాతం భోగాపురం విమానశ్రయ పనులు పూర్తయ్యాయని చెప్పారు కదా అని గుర్తుచేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంబోత్సవానికి 13 వేల మంది గిరిజన చిన్నారులతో ధింసా నృత్యం నిర్వహించి రూ.30 కోట్లు ఖర్చు చేశారని, దీనివల్ల గిరిజన ప్రాంతాలకు ఒరిగిన ప్రయోజనం ఏమిటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని తనూజారాణి ప్రశి్నంచారు.


