సాక్షి,తాడేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు.
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా, వైఎస్సార్సీపీలో చేరారు. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్లోసీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, చేరిన ఆయన అనుచరులందరికీ సాదరంగా వైఎస్సార్సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్ (పీటా నాగమోహనకృష్ణ)ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు.

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, రేపల్లె నియోజకవర్గంలో మంచి పట్టున్న గూడపాటి పార్టీని వీడటం టీడీపీకి పెద్ద లోటుగా మారగా, వైఎస్సార్సీపీకి అక్కడ రాజకీయంగా మరింత బలం చేకూరినట్లయింది.


