గుడివాడ: ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీ.. సూపర్ సున్నా అయ్యిందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు కొడాలి నాని.
సాగునీరు, రైతాంగం సమస్యలు, వైఎస్సార్సీపీపై అక్రమ కేసులు తదితర అంశాలపై కొడాలి నాని స్పందించారు. ‘ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి.. ఎవరూ భయపడొద్దు. కేసులు పెట్టి జైలుకు పంపినా బెదరొద్దు. ఎక్కడా ఏకగ్రీవం కాకుండా పోటీలో ఉందాం. బాబు, పవన్, బీజేపీ మోసాలను ఎండగడదాం’ అని పేర్కొన్నారు.
‘రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రాజెక్టుల్లో నీళ్లుంచుకుని కూడా రైతులకు నీరివ్వడం లేదు. పైనుంచి చెబితే తప్ప నీరివ్వలేమని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకూ తాగునీటికి నీరు కావాలి అందుకే ఇవ్వలేమంటున్నారు. పంటలన్నీ ఎండిపోయి అంతా నాశనమైపోయాక ..నీళ్లు సముద్రంలోకి వదులుతారా?, రైతాంగాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎరువుల కోసం రైతులకు ఓటీపీలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆక్వా రైతులు , సామాన్య ప్రజలు , రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులను ఇబ్బంది పెడుతున్నారు ’ అని పేర్కొన్నారు.


