ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ స్కాం కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, పేకాట ఆడిన వారికి బ్రిడ్జి గేమ్ పేరుతో ఉద్యోగాలు కల్పించారని ఆయన అన్నారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
అలాగే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంపై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారంటూ, దీనికి సంబంధించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తప్ప ఎలాంటి భూసేకరణ చేయలేదు. అలాగే, రూ.5,500 కోట్ల వ్యయంతో జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్టును నిర్మించగా.. జీఎంఆర్కు చంద్రబాబు ప్రభుత్వం ఐదు పైసలు కూడా ఇవ్వలేదు. కానీ తానే కట్టానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే, భూసేకరణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హామీలపైనా కొడాలి నాని మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అమలులో మాత్రం 'సూపర్ సున్నా'గా మిగిలిపోయిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
అలాగే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడవద్దని, ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మోసాలు సాగకుండా ఉండేలా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కొడాలి నాని పిలుపునిచ్చారు.


