బార్ కౌన్సిల్ సభ్యులకు హైకోర్టు సీజే జస్టిస్ లీసా గిల్ హామీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్)కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కింది కోర్టుల్లో న్యాయవాదులు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను సీజే దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టుల్లో మరుగుదొడ్లు, వెయిటింగ్ రూమ్లు లేక మహిళా న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సీజే.. ఈ విషయంలో ఇప్పటికే తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ మరుగుదొడ్లు, వెయిటింగ్ రూంల అవసరం ఉందో వివరాలు తెప్పించుకునే పనిలో ఉన్నానన్నారు.
న్యాయవాదులు మరణించినప్పుడు ఏర్పాటు చేసే సంస్మరణ సభలను సాయంత్రం 4.15 గంటలకు మార్చడంపై కింది కోర్టుల న్యాయవాదుల అభ్యంతరాలను బార్ కౌన్సిల్ నూతన సభ్యులు సీజే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న విధంగా ఉదయమే సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీనిపై కూడా సీజే సానుకూలంగా స్పందించారు. కోర్టు పని మొదలు కావడానికి ముందే సంస్మరణ సభ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని బార్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు.
సీజేను కలిసిన వారిలో అజయ్ కుమార్ చలసాని, కలిగినీడి చిదంబరం, ఆలూరు రామిరెడ్డి, గొర్రెముచ్చు శాంత కుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, యలమంజుల బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాస రాజు, ఎస్.రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి, ఎన్వీ సుమంత్, రవి బెల్లన, బండారు వెంకట రమణ మూర్తి, గంటా రామారావు, కీర్తి రామ జోగేశ్వరరావు, కె. వెంకట్రామిరెడ్డి, మాధవి,కృష్ణమోషన్,అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గా నాగశ్రీ, రాగి గంగా భవాని ఉన్నారు.


