పిడుగురాళ్లకు 50 ఎంబీబీఎస్ సీట్లే
దరఖాస్తు చేసిన 100 సీట్లు రాబట్టడంలో ఘోర వైఫల్యం
వంద సీట్లకు మౌలిక వసతుల కల్పనలో చతికిలబడిన ప్రభుత్వం
ప్రమాణాలకు తగ్గట్టు లేకపోవడంతో 50 సీట్లనే మంజూరు చేసిన ఎన్ఎంసీ
జగన్ హయాంలోనే మెజార్టీ శాతం కళాశాల నిర్మాణం పూర్తి
గద్దెనెక్కాక ఏడాదిన్నర పాటు పనులు ఆపేసిన బాబు సర్కార్
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడంలో ఏపీ కంటే మిన్నగా చిన్న రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలని ఆశలు పెట్టుకున్న విద్యార్థుల పాలిట చంద్రబాబు పాలన పెనుశాపంగా మారింది. ప్రభుత్వ రంగంలో వైద్య విద్యపై ఆయన చూపుతున్న నిర్లక్ష్యంతో మన విద్యార్థుల అవకాశాలకు గండిపడుతోంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) పిడుగురాళ్ల వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసిందని ఇటీవల ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. అయితే వాస్తవానికి ఈ కళాశాలకు కేవలం 50 సీట్లనే ఎన్ఎంసీ మంజూరు చేసింది. 100 ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవ్వడంతో 50 సీట్లనే ఎన్ఎంసీ మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా వైఎస్ జగన్ హయాంలోనే పిడుగురాళ్ల కళాశాల నిర్మాణం ప్రారంభించారు. పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ.500 కోట్లతో అధునాతన వసతులతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించి సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రూ.300 కోట్ల విలువైన మెజార్టీ పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు గద్దెనెక్కాక పీపీపీలో ప్రైవేట్కు కొత్త వైద్య కళాశాలలు కట్టబెట్టే క్రమంలో ఏడాదిన్నరపాటు ఈ కళాశాల నిర్మాణ పనులను నిలిపివేశారు. విద్యార్థిలోకంతోపాటు ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో 100 సీట్లతో 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభించడానికి దరఖాస్తు చేశారు.
మొక్కుబడి దరఖాస్తుతో సరి
మొక్కుబడిగా వైద్య కళాశాల ప్రారంభానికి దరఖాస్తు చేసి బాబు సర్కారు చేతులెత్తేసింది. వైద్య కళాశాలను పూర్తిగా అభివృద్ధి చేయకుండా నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా చూపి తొలుత దరఖాస్తు చేసింది. దీంతో పరిశీలన దశలోనే ఎన్ఎంసీ దరఖాస్తును పక్కన పడేసింది. ఈ క్రమంలో వైద్య శాఖ అప్పీల్కు వెళ్లడంతో దరఖాస్తును ఎన్ఎంసీ అనుమతించింది. ఇదిలా ఉండగా ఎన్ఎంసీ బృందం తనిఖీలకు వచ్చే సమయానికి ప్రభుత్వం పిడుగురాళ్ల బోధనాస్పత్రి, వైద్య కళాశాల, హాస్టళ్లు, ఇతర సదుపాయాలను 100 సీట్లకు సరిపడా చూపించలేకపోయింది.
తనిఖీల అనంతరం 100 సీట్లు మంజూరు చేసినట్టు ఎన్ఎంసీ నుంచి లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) వచ్చిందని వైద్య శాఖ ప్రకటించింది. అయితే గత నెలలో విడుదల చేసిన 2026–27 సీట్మ్యాట్రిక్స్లో పిడుగురాళ్ల వైద్యశాలకు కేవలం 50 సీట్లనే ఎన్ఎంసీ చూపింది. వంద సీట్లు చూపకపోవడంపై ఎన్ఎంసీని వైద్య శాఖ సంప్రదించగా 50 సీట్లే మంజూరు చేశామని ఎన్ఎంసీ తేల్చి చెప్పినట్టు వెల్లడైంది.
కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వమున్నా
జనాభా, స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం ఇలా అనేక అంశాల్లో ఏపీ కంటే ఎంతో చిన్నదైన ఛత్తీస్గఢ్ ఈ విద్యా సంవత్సరం ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభిస్తోంది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం రెండు చోట్లా ఎన్డీఏ ప్రభుత్వాలున్నప్పటికీ దరఖాస్తు చేసిన వంద శాతం ఎంబీబీఎస్ సీట్లను రాబట్టుకోలేని దుస్థితి ఆంధ్రరాష్ట్రానికి దాపురించింది. అదే విధంగా ఏపీ కంటే ఎంతో చిన్న రాష్ట్రాలు సైతం ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నాయి.
సీఎం చంద్రబాబు మాత్రం మన విద్యార్థుల వైద్య విద్య కలను ఛిద్రం చేస్తూ ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలోనూ ఎన్ఎంసీకి లేఖ రాసి మంజూరైన మెడిసిన్ సీట్లను సైతం రద్దు చేయించి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఈ తరహా కుట్రపూరిత విధానాలతో బాబు అధికారం చేపట్టాక రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు.


