నేటి నుంచి ఆలిండియా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు | All India MBBS Counseling Registrations from Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆలిండియా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు

Aug 5 2026 5:58 AM | Updated on Aug 5 2026 5:58 AM

All India MBBS Counseling Registrations from Today

రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు 12వ తేదీ వరకు గడువు

సాక్షి, అమరావతి: 2026–27 ఎంబీబీఎస్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఆలిండియా కోటా కౌన్సె­లింగ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను నేటి నుంచి విద్యార్థులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 12వ తేదీ మధ్యా­హ్నం మూడు గంటలు రిజిస్ట్రేషన్‌కు చివరి గడువు­గా మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) నిర్దేశించింది. గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు అదే రోజు సాయంత్రం ఆరు గంటల్లోపు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు నచ్చిన కళాశాలల్లో ప్రవేశాల కోసం గురువారం నుంచి వెబ్‌ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలి. ఈ నెల 13వ తేదీ వరకూ ఆప్షన్‌లు లాక్‌ చేసుకోవడానికి వీలుంటుంది. 13, 16 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రాసెస్‌ పూర్తి చేసి 17వ తేదీ ఫలితాలను ఎంసీసీ ప్రకటిస్తుంది. ఈ నెల 13 నుంచి రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ప్రారంభం అయ్యేలా ఎంసీసీ ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది.   

రాష్ట్ర స్థాయి కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌కు విడుదల కాని నోటిఫికేషన్‌  
ఈ నెల 13 నుంచి రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేలా ఎంసీసీ ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించినా, ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి కనీ్వనర్‌ కోటా కౌన్సెలింగ్‌కు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయి కళాశాలగా ఉన్న విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని సీట్లను ఎస్వీయూ, ఏయూ రీజియన్‌లకు కేటాయింపుపై ప్రభు­త్వం జీవో ఇవ్వాల్సి ఉంది. ఈ జీవో కోసం వ­ర్సిటీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థలో 250 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వీటిలో 38 సీట్లు ఆలిండియా కోటాలో ఎంసీసీ భర్తీ చేస్తుంది.

మిగిలిన 212 సీట్లలో 15 శాతం 32 సీట్లను అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీ కింద రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారికైనా అవకాశం ఉంటుంది. మిగిలిన 85 శాతం 180 సీట్లను జనాభా దామాషా ప్రకారం ఏయూ, ఎస్వీయూ రీజియన్‌లకు విభజించాలి. గతేడాది 65.62:34.38 నిష్పత్తిలో ఏయూ, ఎస్వీయూలకు సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ ఏడాదికి సీట్ల కేటాయింపును ఖరారు కోసం ఇప్పటికే వర్సిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ఉత్తర్వులు వస్తే రాష్ట్ర స్థాయిలో కన్వీనర్‌ కోటాకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 

మరోవైపు ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాల నిబంధనలను ఈ ఏడాది నుంచి ఎంసీసీ సవరించింది. దూరపు బంధువులు/అసలు బంధుత్వం లేని వ్యక్తుల ద్వారా ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థి­త్వంతో కొందరు ఎంబీబీఎస్‌ సీట్లను పొందుతున్నారనే విమర్శలున్నాయి. ఈ దుర్వినియోగాన్ని కట్టడి చేయడం కోసం విదేశాల్లో ఉండే తల్లిదండ్రులు, రక్త సంబం«దీకుల అభ్యర్థిత్వంతోనే విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా ప్రమాణాలను ఎంసీసీ రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో యాజమాన్య కోటా ప్రవేశాల నిబంధనల్లో మార్పు కోసం ప్రభుత్వానికి వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడాల్సి ఉంది.   

షెడ్యూల్‌ ఇలా.. 
వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం: ఆగస్టు 6  
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు గడువు: ఆగస్టు 12  
సీట్ల కేటాయింపు: ఆగస్టు 13, 16 
తుది జాబితా విడుదల: ఆగస్టు 17 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement