సహోద్యోగిపై అత్యాచారం కేసు
నిర్దోషన్న సెషన్స్ కోర్టు తీర్పు కొట్టివేత
పణజి: తెహల్కా మాజీ సంపాదకుడు, తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల క్రితం సెషన్స్ కోర్టు ఒకటి నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న నేరంలో (ఐపీసీ 376 (2)(ఎఫ్), లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఐపీసీ 354ఏ, మానహాని ఉద్దేశంతో మహిళపై దౌర్జన్యానికి పాల్పడినందుకు ఐపీసీ 354బీల కింద పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సందేకర్ల బెంచ్ తీర్పునిచ్చింది. అరవై రెండేళ్ల వయసున్న, ఇద్దరు పిల్లల తండ్రినైన తనపై దయ చూపాలన్న తరుణ్ తేజ్పాల్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
బాధితురాలికి రూ.10,21,000 పరిహారం చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తేజ్పాల్ ప్రకటించారు. 2013లో గోవాలో జరిగిన ‘థింక్ ఫెస్ట్’అన్న కార్యక్రమంలో తరుణ్ తేజ్పాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ సహోద్యోగి ఒకరు కోర్టుకెక్కారు. దీంతో తేజ్పాల్పై కేసు నమోదైంది. అరెస్టు జరిగి ఛార్జ్ïÙట్ కూడా దాఖలైంది. 2017లో కేసు విచారణ మొదలైంది. మొత్తం 71 మంది సాక్షులను విచారించిన తరువాత 2021 మే నెలలో సెషన్స్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. ఆ తరువాత గోవా కోర్టు హైకోర్టులో కేసు వేయడం, విచారణ తరువాత తాజాగా తీర్పు వెలువడింది.


