E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట | E20 Controversy: Court Shield for Gadkari Fake Posts Face Removal | Sakshi
Sakshi News home page

E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట

Aug 5 2026 12:29 PM | Updated on Aug 5 2026 12:42 PM

E20 Controversy: Court Shield for Gadkari Fake Posts Face Removal

E20 పెట్రోల్‌ వివాదం నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి బాంబే హైకోర్టులో కీలక ఊరట లభించింది. ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ (E20) విధానంతో అనుసంధానిస్తూ సోషల్‌ మీడియాలో ఆయనపై, కుటుంబ సభ్యులపై జరుగుతున్న ప్రచారానికి బుధవారం కోర్టు బ్రేకులు వేసింది. ఈ కంటెంట్‌ను “అసహ్యకరమైనది, దూషణాత్మకమైనది”గా అభివర్ణించిన ధర్మాసనం.. తక్షణమే తొలగించాలని డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (E20) అంశం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడం వల్ల వాహనాల మైలేజ్‌, ఇంజిన్‌ పనితీరుపై ప్రభావం ఉంటుందా? పాత వాహనాలకు ఇది అనుకూలమా? అనే అంశాలపై వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు సోషల్‌ మీడియాలో గడ్కరీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు, వీడియోలు ప్రచారం చేశారు. కేవలం తన కుటుంబ(కొడుకుల) వ్యాపారాలు బాగుండడం కోసమే ఆయన ఆ విధానం తెరపైకి తెచ్చారని జోరుగా ప్రచారం చేశారు. 

ఈ ప్రచారంపై గడ్కరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. E20 విధానం తన శాఖ పరిధిలోది కాదని, ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. తన కుటుంబం చెరుకు పరిశ్రమలో ఏనాటి నుంచో ఉందని.. అయితే ఇథనాల్‌ పెట్రోల్‌ విధానం వల్ల తనకు గానీ, తన కుటుంబానికి గానీ పెద్దగా లాభం లేదని వివరణ ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

విచారణ సందర్భంగా గడ్కరీ తరఫు న్యాయవాదులు.. E20 విధానంపై విమర్శల పేరుతో మంత్రిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు.. మెటా, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలతో పాటు ఇతర మధ్యవర్తి సంస్థలకు ఆ పోస్టులు, వీడియోలను తొలగించాలని ఇవాళ ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. E20 విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం వల్ల దేశ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని, రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది. మైలేజ్‌పై కొంత ప్రభావం ఉండొచ్చని అంగీకరిస్తూనే.. ఇంజిన్లకు నష్టం జరుగుతుందనే వాదనలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

గతంలో లోక్‌సభలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనం రకం, తయారీ సంవత్సరం ఆధారంగా మైలేజ్‌లో 2 నుంచి 6 శాతం వరకు మార్పు ఉండొచ్చని తెలిపారు. E20 అమలు శాస్త్రీయంగా, దశలవారీగా జరిగిందని పేర్కొన్నారు.

మరోవైపు E20పై సుప్రీంకోర్టులోనూ చర్చ జరిగిన నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం E20ను కేవలం “ప్రయోగం”గా పేర్కొన్నట్లు వచ్చిన ప్రచారాన్ని న్యాయశాఖ ఖండించింది. మొత్తంగా E20 విధానంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా గడ్కరీ చేసిన న్యాయపోరాటంలో బాంబే హైకోర్టు ఆదేశాలు కీలక పరిణామంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement