తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విజయ్‌ సర్కార్‌ | Vijay's First Budget Unveiled: Key Highlights and Big Promises | Sakshi
Sakshi News home page

తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విజయ్‌ సర్కార్‌

Aug 5 2026 11:39 AM | Updated on Aug 5 2026 11:49 AM

Vijay's First Budget Unveiled: Key Highlights and Big Promises

తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపుతూ.. విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి డాక్టర్‌ ఎన్‌. మరియా విల్సన్‌ బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, క్రీడల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆ ప్రసంగం కొనసాగుతోంది.. 

తమిళనాడు బడ్జెట్‌ 2026లో ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపు చేశారు. వైద్యం, ప్రజారోగ్య శాఖకు రూ.23,353 కోట్లు (కొన్ని నివేదికల్లో రూ.23,357 కోట్లుగా పేర్కొన్నారు) కేటాయించినట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్‌ ప్రకటించారు.

విజయ్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌లో ఎన్నికల సమయంలో మహిళలకు కీలక హామీ నెరవేర్చింది. వివాహం సందర్భంగా మహిళలకు 8 గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర అందించే ‘సోదరుల బహుమతి పథకం’ కోసం రూ.812 కోట్లు కేటాయించింది. అలాగేన వజాత శిశువులకు బంగారు ఉంగరం అందించే ‘తైమామన్‌ తంగా మోదిరం పథకం’ కోసం రూ.560 కోట్లు కేటాయించారు.

విద్యార్థుల కోసం కూడా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రకటనలు చేశారు. కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి ల్యాప్‌టాప్‌ పథకం’ అమలుకు రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు.

క్రీడారంగానికి పెద్దపీట వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు కోసం రూ.5.50 కోట్లు కేటాయించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే స్థాయికి తమిళనాడు క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

అలాగే మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌ పేరుతో అమలవుతున్న అల్పాహార పథకానికి రూ.710 కోట్లు కేటాయించారు. విద్యార్థుల పోషకాహారం, పాఠశాల హాజరు పెంపు లక్ష్యంగా ఈ పథకాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

న్యాయ విద్య రంగంలోనూ కీలక ప్రకటన చేశారు. మదురైలో ప్రత్యేక ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మరియా విల్సన్‌ సీఎం విజయ్‌ను ప్రశంసించారు. టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, కొందరు వ్యక్తులు, వర్గాలకు వెళ్లే ‘కట్‌’ విధానాన్ని నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. NEET‌ పరీక్షపై కూడా TVK ప్రభుత్వం తన వైఖరిని పునరుద్ఘాటించింది. NEET‌ను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా పాత విధానంలోనే వైద్య ప్రవేశాలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్‌ సర్కార్‌కు ఇది తొలి బడ్జెట్‌. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు, యువత-మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. మొదటి బడ్జెట్‌లోనే సంక్షేమం, విద్య, మహిళలు, క్రీడలపై ఫోకస్‌ పెట్టిన విజయ్‌ సర్కార్‌.. ప్రజల్లో తన పాలన దిశను స్పష్టం చేసే ప్రయత్నం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement