E20పై ఆల్‌ క్లియర్‌.. వెనక్కి తగ్గం: కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి | E20 Petrol Row: Centre Stands Firm as AAP Demands Rollback to E10 | Sakshi
Sakshi News home page

E20పై ఆల్‌ క్లియర్‌.. వెనక్కి తగ్గం: కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి

Aug 5 2026 7:04 AM | Updated on Aug 5 2026 7:12 AM

E20 Petrol Row: Centre Stands Firm as AAP Demands Rollback to E10

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న E20 పెట్రోల్‌ విధానంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆప్‌ నిన్న రాజధానిలో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (Ethanol Blended Petrol) కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని.. E20 నుంచి తిరిగి E10 పెట్రోల్‌కు వెళ్లే ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించింది. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ సంజయ్‌ సింగ్‌ మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. E20 పెట్రోల్‌ అమలు అనేది శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు, విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత దశలవారీగా చేపట్టిన కార్యక్రమమని కేంద్రం తరఫున సురేశ్‌ గోపి స్పష్టత ఇచ్చారు. నీతి ఆయోగ్‌, వాహన తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ARAI), సియామ్‌ (SIAM), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం వంటి సంస్థలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

E10కు తిరిగి వెళ్లే ఆలోచన లేదు
E20 పెట్రోల్‌ వల్ల ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ప్రయోజనాలు వంటి అంశాలకు ప్రాధాన్యం లభిస్తుందని సురేశ్‌ గోపీ అన్నారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్‌ బంకుల్లో E0, E10, E20 వంటి వేర్వేరు రకాల ఇంధన సరఫరా వ్యవస్థలను కొనసాగించడం వల్ల రవాణా, నిల్వ, నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతాయని తెలిపింది. అందువల్ల వినియోగదారుల సౌకర్యం, ఇంధన అవసరాలు, పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని E20 విధానాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

  • E10 పెట్రోల్‌: పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌, 90 శాతం పెట్రోల్‌ కలిపిన ఇంధనం.
  • E20 పెట్రోల్‌: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌, 80 శాతం పెట్రోల్‌ కలిపిన ఇంధనం.

మైలేజీ తగ్గుదలపై కేంద్రం వివరణ
E20 పెట్రోల్‌తో వాహనాల మైలేజీ తగ్గుతుందనే ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. వాహనం పనితీరు డ్రైవింగ్‌ పరిస్థితులు, డ్రైవింగ్‌ అలవాట్లు, వాహన నిర్వహణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలు, ఆటోమొబైల్‌ కంపెనీలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. E10 కోసం రూపొందించిన కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుదల సాధారణంగా 3 నుంచి 5 శాతం వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. E20లో ఆక్టేన్‌ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఇంజిన్‌ పనితీరు మెరుగుపడుతుందని, నాక్‌ సమస్యలు తగ్గుతాయని వివరించింది.

కాలుష్యం తగ్గుతుంది
E20 పెట్రోల్‌ వల్ల కార్బన్‌ ఉద్గారాలు తగ్గుతాయని కేంద్రం తెలిపింది. E10తో పోలిస్తే E20 ఇంధనం దాదాపు 30 శాతం వరకు కార్బన్‌ ఉద్గారాలను తగ్గించగలదని పేర్కొంది. ఇథనాల్‌ అధికంగా కలపడం వల్ల దహనం మరింత సమర్థవంతంగా జరుగుతుందని, కాలుష్య కారకాలు తగ్గుతాయని వివరించింది.

గత కొన్నేళ్లుగా E15 కంటే ఎక్కువ ఇథనాల్‌ కలిగిన పెట్రోల్‌ విస్తృతంగా వినియోగంలో ఉందని కేంద్రం తెలిపింది. E19-E20 ఇంధనాన్ని కూడా రెండున్నరేళ్లకు పైగా ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇథనాల్‌ కలపడం వల్ల ఇంజిన్‌ వైఫల్యాలు, వాహనాలు దెబ్బతినడం వంటి విస్తృత స్థాయి సమస్యలు నమోదుకాలేదని వెల్లడించింది.

రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య ఆదా
ఇథనాల్‌ బ్లెండింగ్‌ కార్యక్రమం ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు లభించాయని కేంద్రం వెల్లడించింది. 2014-15 ఇథనాల్‌ సరఫరా సంవత్సరం నుంచి 2025-26 జూన్‌ వరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చేపట్టిన ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయినట్లు పేర్కొంది. అలాగే సుమారు 316 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చమురు దిగుమతులను తగ్గించగలిగామని, దాదాపు 952 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించామని కేంద్రం వివరించింది.

మొత్తంగా.. E20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలు, ఆందోళనల మధ్య కేంద్రం తన విధానాన్ని మరోసారి సమర్థించుకుంది. ఇంధన భద్రత, పర్యావరణ ప్రయోజనాలు, దేశీయ ఇథనాల్‌ ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని E20 అమలు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement