గాల్లో నరకం.. ఒక్క క్షణం ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం! | Mid Air Nightmare: Air India Passengers Thought It Was Over | Sakshi
Sakshi News home page

గాల్లో నరకం.. ఒక్క క్షణం ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం!

Aug 5 2026 12:15 PM | Updated on Aug 5 2026 12:29 PM

Mid Air Nightmare: Air India Passengers Thought It Was Over

ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణం.. అంతలోనే ఒక్కసారిగా భారీ కుదుపులు. క్షణాల్లోనే ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. లగేజీ బిన్లు తెరుచుకున్నాయి.. క్యాబిన్‌ ప్యానెల్స్‌ ఊడిపోయాయి.. కేకలు, ఆందోళనలతో విమానం భయానక దృశ్యంగా మారింది. ఫుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే భయాన్ని మిగిల్చింది.

ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం మంగళవారం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో క్రూజింగ్‌ దశలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్ర టర్బులెన్స్‌కు(కుదుపు) గురైంది. దీంతో గాయాల పాలైన ప్రయాణికులు.. ప్రాణభీతితో వణికిపోయారు.  

కొందరు ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలాంటి ముందస్తు హెచ్చరిక జారీ కాలేదు. హఠాత్తుగా విమానం భారీగా ఊగిపోయింది. ఒక్కసారిగా విమానం కిందకు పడిపోయినట్లు అనిపించింది. కొందరు ప్రయాణికులు సీట్ల నుంచి పైకి ఎగిరి పైభాగాన్ని ఢీకొన్నారు. క్యాబిన్‌లో లగేజీ కిందపడటం, ఓవర్‌హెడ్‌ బిన్లు దెబ్బతినడం, ప్యానెల్స్‌ ఊడిపోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయగా.. కొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.

మేము బతకమని అనుకున్నాం
ఇటలీకి చెందిన వివియానా అనే ప్రయాణికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ.. “ఒక్కసారిగా టర్బులెన్స్‌ మొదలైంది. నా సోదరి సీటు నుంచి గాల్లోకి ఎగిరిపోయింది. నా తల్లి తలకు గాయమైంది. వెనుక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడి ముఖంపై రక్తం కనిపించింది. మేము చనిపోతామని అనుకున్నాం” అంటూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంది.

మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. తన తండ్రి సీటు నుంచి పైకి ఎగిరి విమానం పైభాగానికి తగిలి కిందపడ్డారని తెలిపాడు. తన భార్య, రెండేళ్ల చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపడి గాయపడ్డారని, ఈ ఘటన తమకు “పునర్జన్మలా అనిపించింది” అని చెప్పాడు.

వీడియోలు తీయొద్దన్నారు
ఈ ఘటనపై విమానంలో ప్రయాణించిన కంటెంట్‌ క్రియేటర్‌ శిల్పి జైన్‌ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశారు. విమానం కూలిపోతుందేమోనని భయపడ్డామని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దని సిబ్బంది కోరారని, ఎయిర్‌లైన్‌ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పినట్లు ఆరోపించారు. ల్యాండింగ్‌ తర్వాత కూడా వెంటనే వైద్య సాయం అందలేదని, కొంతమంది ప్రయాణికులు సహాయం కోసం వేచి చూడాల్సి వచ్చిందని శిల్పి జైన్‌ పేర్కొన్నారు. 

17 మందికి గాయాలు
ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడగా.. వారిలో నలుగురు క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత గాయపడిన వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు. కొందరిని ఆస్పత్రుల్లో చేర్చారు. ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ.. ప్రయాణ సమయంలో కొద్దిసేపు తీవ్ర టర్బులెన్స్‌ ఎదురైందని, ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపింది. తీవ్రమైన ప్రాణాపాయం లేదని పేర్కొంది. 

ఘటనపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు.. ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లి గాయపడిన ప్రయాణికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

టర్బులెన్స్‌ ఘటనలు పెరుగుతున్నాయా?
ఇది ఇటీవలి కాలంలో నమోదైన మరో తీవ్రమైన టర్బులెన్స్‌ ఘటన. 2026లోనే ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్‌ వెళ్తున్న క్యాథే పసిఫిక్‌ విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురై 10 మంది గాయపడ్డారు. అంతకుముందు 2025లో డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం తీవ్ర టర్బులెన్స్‌ కారణంగా అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఆ ఘటనలో 25 మంది వరకు గాయపడ్డారు. వాతావరణ మార్పులు, గాలి ప్రవాహాల్లో అనూహ్య మార్పుల కారణంగా తీవ్రమైన టర్బులెన్స్‌లు మరింత తరచుగా ఎదురవుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. 

ప్రయాణికులకు మరోసారి హెచ్చరిక
ఈ ఘటన మరోసారి విమానంలో ఉన్నప్పుడు సీటు బెల్ట్‌ ధరించడం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. సాధారణంగా విమానం గాల్లో ఉన్నప్పుడు చిన్న కుదుపులు సహజమే అయినా.. ఇలాంటి ఆకస్మిక టర్బులెన్స్‌లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల గందరగోళం.. 145 మందికి పైగా ప్రయాణికుల జీవితాల్లో మాత్రం మరచిపోలేని భయానక అనుభవంగా మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement