భారత్‌ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు! | Hasina's India Address Sparks Fresh Tension in Bangladesh | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు!

Aug 5 2026 10:52 AM | Updated on Aug 5 2026 11:07 AM

Hasina's India Address Sparks Fresh Tension in Bangladesh

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారారు. దేశం విడిచి భారత్‌లో ఉంటున్న ఆమె.. బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.

2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్‌ ట్రైబ్యునల్‌ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.

ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్‌ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.

అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.

మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.

ఈ పరిణామాలపై భారత్‌ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే.. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌ను కోరుతూనే ఉంది. హసీనా భారత భూభాగం నుంచి రాజకీయ ప్రకటనలు చేయడంపై ఢిల్లీకి తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు బంగ్లాదేశ్‌ అధికారులు చెబుతున్నారు.

హసీనా అధికారం కోల్పోయిన తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె వర్చువల్‌ ప్రసంగం నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తెరలేచింది. **భారత్‌ వేదికగా హసీనా గళం వినిపించనుండటం.. బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement