కొండలు కూలాయి.. ఊర్లు మునిగాయి! | Sri Lankas Nature Fury: Hills Collapse Villages Drown Reason Behind It | Sakshi
Sakshi News home page

కొండలు కూలాయి.. ఊర్లు మునిగాయి!

Aug 5 2026 8:37 AM | Updated on Aug 5 2026 8:45 AM

Sri Lankas Nature Fury: Hills Collapse Villages Drown Reason Behind It

అందమైన ప్రకృతి దృశ్యాలకు పేరుగాంచిన శ్రీలంక ఇప్పుడు ప్రకృతి విలయంతో వణికిపోతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొండలు కూలి ఇళ్లను మట్టిలో కలిపేయగా.. ఉప్పొంగిన వరదలు గ్రామాలను నీట ముంచాయి. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులై సురక్షిత ప్రాంతాలకు తరలాల్సి వచ్చింది.

శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పరిస్థితిని తీవ్రంగా మార్చాయి. శ్రీలంకలోని మధ్య కొండ ప్రాంతాలు ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా కాండీ (Kandy), నువర ఎలియా (Nuwara Eliya), బదుల్ల (Badulla), రత్నపుర (Ratnapura) వంటి జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియల ప్రమాదం పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోగా.. ఇళ్లలోకి మట్టి, వరద నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఎందుకీ ప్రకృతి బీభత్సం?
శ్రీలంక భౌగోళిక పరిస్థితులే ఇలాంటి విపత్తులకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఆ దేశంలోని మధ్య, పర్వత ప్రాంతాల్లో ఎత్తైన కొండలు, వాలు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు నేలలోకి అధికంగా నీరు చేరి బలహీనపడుతుంది. దీంతో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతాయి.

వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. అడవుల నరికివేత, కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా ప్రమాదాన్ని మరింత పెంచే అంశాలుగా మారుతున్నాయి.

మృత్యువాత.. నిరాశ్రయులుగా వేలాది మంది
తాజా విపత్తులో పలువురు మృతి చెందగా.. మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పరిస్థితి చెబుతోంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రీలంక సైన్యం, నేవీ, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగాయి. పడవలు, ప్రత్యేక సహాయక బృందాల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.

ఒక్క వర్షం.. భారీ నష్టం
శ్రీలంకకు వరదలు, కొండచరియలు కొత్త సమస్య కాదు. ప్రతి ఏటా వర్షాకాలంలో పర్వత ప్రాంతాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటుంటాయి. అయితే ఈసారి వర్ష తీవ్రత ఎక్కువగా ఉండటంతో నష్టం కూడా భారీగా నమోదవుతోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ప్రాంతాల్లో ప్రజల తరలింపు వంటి చర్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

మొత్తంగా.. ప్రకృతి కన్నెర్రతో శ్రీలంక మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు కొండచరియలు.. మరోవైపు వరదలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement