కేంద్ర మంత్రులు సీఆర్పాటిల్, భూపేంద్ర యాదవ్లతో నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతుల సాధనే ఎజెండాగా ఆయన ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్. పాటిల్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్లతో భేటీ కానున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఇరువురు మంత్రులకు ఆయన వినతిపత్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున వీలును బట్టి పలు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసే అవకాశముందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.


