వాషింగ్టన్: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రికార్డు స్థాయిలో 8.5 లక్షల టపాసులను కాల్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ భారీ బాణసంచా ప్రదర్శన కారణంగా తీవ్ర వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ నష్టం వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాషింగ్టన్లో భారీ ఏర్పాట్లు
అమెరికా ఆవిర్భవించి 250 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా వాషింగ్టన్ డీసీలో శనివారం(జూలై 4) రాత్రి దేశ చరిత్రలోనే అతిపెద్ద బాణసంచా ప్రదర్శనను నిర్వహించనున్నారు. ట్రంప్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఫ్రీడమ్ 250’ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లింకన్ మెమోరియల్, పొటొమాక్ నది పరిసరాల్లోని 10 ప్రదేశాల నుంచి ఒకే రాత్రిలో 8,50,000 టపాసులను కాల్చనున్నారు. గిన్నిస్ రికార్డులను తిరగరాసేలా ప్లాన్ ఈ ప్రదర్శన ఉండనుంది.
ఆరోగ్యానికి ముప్పు: శాస్త్రవేత్తల ఆందోళన
ఈ చారిత్రాత్మక వేడుకపై దేశవ్యాప్తంగా ఉత్సాహం వ్యక్తమవుతున్నప్పటికీ, పర్యావరణ శాస్త్రవేత్తలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుందని హెచ్చరిస్తున్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ రసాయన శాస్త్ర ఆచార్యులు రస్సెల్ డికెర్సన్ మాట్లాడుతూ.. ‘నాకు బాణసంచా అంటే ఇష్టమే, కానీ ఇప్పటికే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కాలుష్యంతో నిండి ఉన్న తరుణంలో ఒకేసారి 8.5 లక్షల టపాసులు కాల్చడం సరైన నిర్ణయం కాకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ఈ పొగ వల్ల వచ్చే శ్వాసకోశ ఇబ్బందుల కారణంగా తాను, తన మనవళ్లు ఈ వేడుకకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
మరోవైపు, బాణసంచా అనేది అమెరికా సంస్కృతి, స్వాతంత్ర్య సంబరాల్లో ఒక భాగమని నిర్వాహక సంస్థ ‘పైరెక్టెక్నికో’ మార్కెటింగ్ డైరెక్టర్ జోడి డేగు పేర్కొన్నారు. ఇవి కుటుంబాలను ఏకం చేసి, మధుర జ్ఞాపకాలను అందిస్తాయని అన్నారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరికా వాకర్ మాట్లాడుతూ.. నిరంతరం జరిగే కాలుష్యంతో పోలిస్తే ఒక రోజు జరిగే ఈ వేడుకను భిన్నంగా చూడాలన్నారు.


