న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాకిస్తాన్ను నేరుగా, నిర్మొహమాటంగా విమర్శించారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం పాకిస్తాన్ ప్రపంచ ప్రతిష్టను పెంచవచ్చేమో, కానీ.. దేశంలో అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించలేదన్నారు. కౌసికన్ సూటిగా పాక్ వైఫల్యం అంచున ఉన్న దేశమన్నారు. పాకిస్తాన్ సమస్య భారత్, ఆఫ్ఘనిస్థాన్ కాదని, దాని సొంత రాజకీయ నాయకులు, సైన్యమేనని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక ప్రపంచ సదస్సులో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా కౌసికన్..‘పాకిస్తాన్ దౌత్యపరమైన ఎత్తుగడలను బాగా వేసి ఉండవచ్చు, కానీ అది దేశ ప్రజలకు అన్నం పెట్టదని నొక్కి చెప్పారు. ఒక దౌత్యపరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాకిస్తాన్ చాలా చురుకుగా, చాలా విజయవంతంగా వ్యవహరించిందని, అమెరికా దృష్టిలో దౌత్యపరంగా పాకిస్తాన్ను పునరుద్ధరించడానికి అది కొంతవరకు దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికి అది పెద్దగా ఏమీ చేయలేదన్నారు. తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి 10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. పాక్ ఇటీవలి దౌత్య విజయాలు దీర్ఘకాలంలో అమెరికాతో దాని సంబంధాలను మారుస్తాయన్న అంచనాలపైనా ఆయన నీళ్లు చల్లారు. పాక్పై విధించిన ఆంక్షలన్నింటినీ అమెరికా ఎప్పటికీ ఎత్తివేయదని స్పష్టం చేశారు.
భౌగోళిక కారణాలు సాకు మాత్రమే...
భారత్, ఆఫ్ఘనిస్థాన్లతో ఉన్న సరిహద్దుల వల్లే పాకిస్తాన్ సమస్యలు ఎదుర్కొంటోందన్న ఓ పాక్ జర్నలిస్ట్ అభిప్రాయాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘‘ప్రతిదానికీ భౌగోళిక స్థానాన్ని కారణంగా చూపలేరు. అది కేవలం ఒక సాకు మాత్రమే. ఆ సంక్షోభం పాక్ రాజకీయ నాయకులు, సైన్యం సృష్టించుకున్నదే’’ కౌసికన్ పేర్కొన్నారు. ప్రారంభం నుంచీ పాక్లో పాలన దారుణంగా ఉంది. నాకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. అక్కడి రాజకీయ నాయకులు, పారీ్టలు వృధా. ఈ సమస్యలో సైన్యం కూడా పెద్ద భాగంగా ఉంది’’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ స్వతంత్ర చరిత్రలో దాదాపు సగం కాలం పాటు సైన్యం పాలనలోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యకలాపాలపై సైన్యం ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కౌసికన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


