పాక్‌లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్ | Pakistan's mega placenta smuggling syndicate feeding global anti-aging trade | Sakshi
Sakshi News home page

పాక్‌లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్

Jul 4 2026 8:19 AM | Updated on Jul 4 2026 9:10 AM

Pakistan's mega placenta smuggling syndicate feeding global anti-aging trade

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లోని ఆస్పత్రుల నుంచి ప్లాసెంటా(మాయ)లను కొనుగోలు చేసి, వాటిని రహస్య ప్రాంతాల్లో ఎండబెట్టి, ప్రాసెస్ చేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ఒక పెద్ద ముఠాను పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) బట్టబయలు చేసింది. ప్లాసెంటా (మాయ) అనేది గర్భధారణ సమయంలో తల్లి గర్భాశయంలో ఏర్పడుతుంది. ఇది బొడ్డు తాడు  ద్వారా పిండంతో అనుసంధానమై ఉంటుంది. తల్లి రక్తం నుండి పిండానికి ఆక్సిజన్, పోషకాలు, యాంటీబాడీలను అందించడంతో పాటు, పిండం నుండి కార్బన్ డైయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే గర్భధారణను కొనసాగించడానికి, శిశువు ఎదుగుదలకు, ప్రసవానికి అవసరమైన హార్మోన్లను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. ప్రసవం తర్వాత దీనిని వైద్య వ్యర్థాలుగా పారవేస్తారు.

అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఖరీదైన ‘యాంటీ ఏజింగ్’ ఇంజెక్షన్ల తయారీ కోసం ఈ మానవ కణజాలాలను విదేశాలకు ఆ ముఠా స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామాబాద్‌లోని ఒక గృహంలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్‌పై అధికారులు దాడి చేశారు. అక్కడ మానవ అవయవాలను, ముఖ్యంగా మాయలను ఎండబెట్టడానికి అమర్చిన పెద్ద పెద్ద రాక్‌లు, ట్రేలను కనుగొన్నారు. ఈ సోదాల్లో సుమారు 500 నుండి 550 కిలోల మాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వియత్నాంనకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 100 కిలోల మానవ కణజాలాల షిప్‌మెంట్‌ను విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సంబంధించి ముగ్గురు చైనా పౌరులు, ఇద్దరు పాకిస్తాన్ పౌరులతో కలిపి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఆస్పత్రి సిబ్బందికి ఒక్కో మాయకు సుమారు 800 పాకిస్తానీ రూపాయలు చెల్లించి ఈ ముఠా సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిని ప్రాసెస్ చేసిన తర్వాత 'షీ ప్లాసెంటా' వంటి పేర్లతో వియత్నాం వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కణజాలంతో తయారు చేసే ఒక్కో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ధర అంతర్జాతీయ మార్కెట్లోలక్షల్లో పలుకుతోందని, విదేశాల్లోని సంపన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం సాగుతోందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: బోల్సోనారో గృహ నిర్బంధం పొడిగింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement