ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.
భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.
భారత ప్రధాని శనివారం లక్సాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కింద తమ దేశం నుంచి భారత్కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


