భారత్‌ కలలు ఆశయాలకు ప్రజలే పునాది | PM Narendra Modi participates community event in Melbourne, Australia | Sakshi
Sakshi News home page

భారత్‌ కలలు ఆశయాలకు ప్రజలే పునాది

Jul 10 2026 5:08 AM | Updated on Jul 10 2026 5:08 AM

PM Narendra Modi participates community event in Melbourne, Australia

అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా పయనం  

‘సిందూర్‌’లో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రపంచం చూసింది  

‘మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ’లో ప్రధాని స్పష్టీకరణ  

మెల్‌బోర్న్‌: ‘ఎక్కువగా కష్టపడడం, మరింత ఎక్కువగా సాధించడం’అనే దార్శనికతతో అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్‌ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశం గొప్ప కలలు, ఉన్నత ఆశయాలకు ప్రజలే పునాది అని స్పష్టంచేశారు. గురువారం ఆ్రస్టేలియాలో ‘మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ’కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. 

విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఆ్రస్టేలియా మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్‌ కృషి చేస్తోందన్నారు. నాగరిక్‌ దేవోభవ(పౌరుడే దైవం) అనే మంత్రం తమ పాలనకు మార్గదర్శక సూత్రంగా మారిందని ప్రకటించారు. తమ ప్రభుత్వ విధానాలు పౌరుల సంక్షేమమే కేంద్రంగానే ఉంటాయన్నారు. 

భారత్‌ నేడు చిప్స్‌ నుంచి షిప్‌ల వరకు ఒక నూతన తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మోదీ ప్రస్తావించారు. ఈ ఆపరేషన్‌ సమయంలో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూసిందన్నారు. ముష్కర మూకల స్థావరాల వద్ద పేలుళ్లు జరిగితే వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా మార్మోగిందని వ్యాఖ్యానించారు. 

మిత్రులు, భాగస్వాములతో కలిసి..  
భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోందని మోదీ వెల్లడించారు. దేశంలో 2 లక్షలకుపైగా నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రతినెలా 4 వేలకుపైగా కొత్త స్టార్టప్‌లు నమోదవుతున్నాయని చెప్పారు. రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో వందలాది స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ అంతరిక్ష స్టార్టప్‌ తన సొంత రాకెట్‌ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇండియా విధానం కేవలం సొంత పురోగతిపై దృష్టి సారించడం మాత్రమే కాదని.. మిత్రులు, భాగస్వాములతో కలిసి అడుగులు వేయడమని నొక్కిచెప్పారు. 

ప్రవాస భారతీయులే ‘జీవన వారధి’ 
వెనెజువెలాలో ఇటీవల భూకంపాలు సంభవిస్తే భారత్‌ వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టిందని, త్వరగా తోడ్పాటు అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. వెనెజువెలా బాధను భారత్‌ తన సొంత బాధగా భావించిందని అన్నారు. సహాయం చేసేటప్పుడు పాస్‌పోర్ట్‌లను గానీ, వాటి రంగును గానీ భారత్‌ చూడదని ఉద్ఘాటించారు. అందుకే ప్రపంచం భారత్‌పై అపారమైన నమ్మకాన్ని పెట్టుకుందని చెప్పారు. 

భారత్‌–ఆ్రస్టేలియా సంబంధాలు బలపడడం వెనుక ప్రవాస భారతీయులదే కీలక పాత్ర అని మోదీ ప్రశంసించారు. వారిని రెండు దేశాల మధ్య ‘జీవన వారధి’గా అభివరి్ణంచారు. ఇంట్లో ఉపయోగించే పాలు ఆస్ట్రేలియన్‌ కావొచ్చు గానీ తయారుచేసే టీ మాత్రం భారతీయమైనదని చెప్పారు. పప్పులు, కూరగాయలు ఆ్రస్టేలియాలవే అయినా వాటికి అసలైన భారతీయ మసాలాలతో తాలింపు పెడతారని వెల్లడించారు. మెల్‌బోర్న్‌ సిటీని మినీ ఇండియాగా అభివరి్ణంచారు.  

టీ20 మ్యాచ్‌లా.. టెస్ట్‌ మ్యాచ్‌లా  
రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి క్రీడల రంగం కూడా ఉందని మోదీ అన్నారు. ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్‌బోర్న్‌లో ఉంటూ క్రీడల గురించి మాట్లాడకపోవడం అనేది టాస్‌ వేసిన తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించకపోవడంతో సమానమని సరదాగా వ్యాఖ్యానించారు. మన నిర్ణయాలు టీ20 మ్యాచ్‌లా వేగంగా, భాగస్వామ్యం మాత్రం టెస్ట్‌ మ్యాచ్‌లా సుదీర్ఘంగా, లోతుగా ఉండాలని అన్నారు. భారత్‌–ఆస్ట్రేలియా దేశాల అజెండా ఒక వన్డే మ్యాచ్‌లా లక్ష్యంపైనే దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement