మరోసారి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: గత ఏడాది భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే స్వయంగా జోక్యం చేసుకొని నిలిపివేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఆయన బుధవారం తుర్కియే నుంచి తిరిగివస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడారు. భారత్–పాక్ యుద్ధంలో 11 ఫైటర్ జెట్లు నేలకూలాయని చెప్పారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. భారత్–పాక్ యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను తాను ఆపేశానని అన్నారు. ఈ ఘనత సాధించినందుకు నోబెల్ శాంతి బహుమ తికి తాను అన్నివిధాల అర్హుడినని స్పష్టంచేశారు.
తనకంటే అర్హులు ఇంకెవరున్నారని ప్రశ్నించారు. ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే భారత్–పాక్ ఘర్షణ అణు యుద్ధంగా మారేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడం ద్వారా 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను ప్రశంసించారని ట్రంప్ గుర్తుచేశారు. అణు యుద్ధమే జరిగితే అంతకంటే ఎక్కువగానే ప్రాణనష్టం వాటిల్లి ఉండేదన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ముష్కర మూకల స్థావరాలపై గత ఏడాది మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


