చంపేసినా సరే... నా సొంత గడ్డపైనే ప్రాణాలు విడుస్తా అంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో తనపై మరణశిక్ష పడినప్పటికీ.. భయపడేది లేదని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశ ప్రవాసం ముగించుకుని బంగ్లాదేశ్ తిరిగి వెళ్లనున్నట్లు ఆమె ప్రకటించారు. అక్కడ కోర్టుల ముందే లొంగిపోయి.. తనపై వచ్చినవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని నిరూపిస్తానని రాయిటర్స్ ఇంటర్వ్యూలో హసీనా స్పష్టం చేశారు.
హసీనాకు బంగ్లాదేశ్లో కొన్ని కేసుల్లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. విద్యార్థుల నిరసనలను అణచివేయడంలో ఆమె పాత్ర ఉందనే ఆరోపణలపై, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నవంబర్ 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది.
1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు.
ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.


