అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగుతున్న వేళ.. మెక్సికో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అమెరికా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో తమ పౌరులు మరణించడంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా వలస, కస్టమ్స్ అమలు సంస్థ (ICE) అక్రమ వలసదారుల్ని అదుపు తీసుకునే చర్యల్లో భాగంగా.. పలువురిని చంపింది. అదే సమయంలో.. అదుపులోకి తీసుకునే క్రమంలో మరికొందరు ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే అలా మరణించిన మెక్సికన్ పౌరుల కేసుల్లో అమెరికా కోర్టుల్లో నేరపూరిత ఫిర్యాదులు (Criminal Complaints) దాఖలు చేయనున్నట్లు క్లాడియా ప్రభుత్వం ప్రకటించింది.
షీన్బామ్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. తమ పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం దౌత్యపరమైన నిరసనలతో సరిపెట్టకుండా, నేర విచారణలు జరగాలని అమెరికా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామని చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ మరణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఇటీవల టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన కాల్పుల ఘటన నిలిచింది. 52 ఏళ్ల మెక్సికన్ పౌరుడు లోరెన్సో సాల్గాడో అరౌజోను ఐస్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ సందర్భంగా కాల్చి చంపారు. అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) ప్రకారం.. అతను తన వాహనాన్ని అధికారులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు తెలిపింది.
అయితే ఈ వాదనను మృతుడి కుటుంబం, మెక్సికో ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. అతను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని భావించి భయంతో వాహనం నడిపాడని అంటున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు.. ఈ కేసుల్లో అమెరికా రాష్ట్రాల ప్రాసిక్యూటర్లతో పాటు ఫెడరల్ న్యాయ శాఖను కూడా ఆశ్రయించనున్నట్లు మెక్సికో విదేశాంగ ఉపమంత్రి రొబర్టో వెలాస్కో వెల్లడించారు. అంతేకాదు, వలస నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలపై పౌర నష్టపరిహార (Civil) కేసులు కూడా వేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దౌత్య మార్గాన ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇప్పుడు నేరుగా న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ఆయన వివరించారు.
మెక్సికో విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు ఐస్ కస్టడీలో 14 మంది మెక్సికన్ పౌరులు మరణించారు. అదుపులోకి తీసుకునే క్రమంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు సాధారణ సంఘటనలు కావని, మానవ హక్కుల ఉల్లంఘనల కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందని మెక్సికో అభిప్రాయపడుతోంది.
ఇదిలా ఉండగా, అమెరికా అంతర్గత భద్రతా శాఖ మాత్రం మెక్సికో ఆరోపణలను తోసిపుచ్చింది. ఐస్ కస్టడీలో మరణాల సంఖ్య పెరిగిందన్న వాదన సరికాదని, అదుపులో ఉన్న వారికి అవసరమైన వైద్యసేవలు, చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నామని తెలిపింది. హ్యూస్టన్ ఘటనలో కూడా అధికారి ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై అమెరికా న్యాయ శాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు చేపడుతున్న కఠిన చర్యలు, పెరుగుతున్న నిర్బంధాలు, కాల్పుల ఘటనలపై ఇప్పటికే మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు మెక్సికో ప్రభుత్వం నేరుగా అమెరికా కోర్టుల్లో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయాలని నిర్ణయించడం రెండు దేశాల మధ్య వలస విధానాలపై మరో పెద్ద దౌత్య, న్యాయ వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


