రెండు వారాల క్రితం వెనిజువెలాలో సంభివించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విధ్వంసం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 3,889కు చేరుకుంది. దాదాపు 17 వేల మందికి పైగా గాయాలయ్యాయి.భూకంపం వల్ల అతలాకుతలమైన వెనిజువెలా పునరుద్ధరణకు ఐక్యరాజ్య సమితి సుమారు 300 మిలియన్ డాలర్లు (సుమారు ₹2,500 కోట్ల) నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.
జూన్ 24న సంభవించిన జంటనగరాలలో 7.2 మరియు 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించింది. నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన నివేదిక ప్రకారం..ఈ జంట భూకంపాల వల్ల దాదాపు 17,000 మంది గాయపడగా, మరో 18,000 మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశాల్లో స్తంభింపజేసిన వెనిజులా నిధులను విడుదల చేయాలని తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కోరారు.
అంతర్జాతీయ సహాయం, నష్టం వివరాలు
ఐక్యరాజ్యసమితి నిధుల సేకరణతో పాటు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద నిలిచిపోయిన తమ ఆర్థిక ఆస్తులను పునరుద్ధరించుకోవడానికి చర్చలు జరుపుతోందని IMF ప్రతినిధి జూలీ కోజాక్ తెలిపారు. ఈ భూకంపం వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న తీరప్రాంతం 'లా గుయైరా'లో 800 కంటే ఎక్కువ భవనాలు దెబ్బతినగా, 190 భవనాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి.
శకలాల కింద ఆశల వేట
విపత్తు జరిగి 15 రోజులు కావస్తుండటంతో రెస్క్యూ టీమ్లు ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడం ఆపేస్తున్నప్పటికీ, కొందరు కుటుంబ సభ్యులు మాత్రం తమ వారి కోసం ఆశలను వదులుకోలేదు. లా గుయైరా నగరంలోని 'ప్లాయా గ్రాండే'లో ఉన్న భారీ శకలాల కుప్పల కింద తన ఇద్దరు టీనేజ్ కుమారులు సమాధి అయి ఉన్న స్థలాన్ని తాను గుర్తించానని సిరో ఒక్యాండో అనే ఒక వ్యక్తి తెలిపారు. ఈ దశలో వారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసినప్పటికీ తన 13, 18ఏళ్ల కుమారుల మృతదేహాలనైనా తీసుకోవాలని తపనపడుతున్నట్లు పేర్కొన్నారు.
"నేను సరైన స్థలంలోనే వెతుకుతున్నాను, కానీ ఇక్కడ శకలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని సొంతంగా చేతి పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ ఆయన మీడియాతో కన్నీటీ పర్యంతమవుతూ తెలిపారు. తన కుమారుల మృతదేహాల కోసం తండ్రి వెతకడం పలువురిని కంటతడికి గురి చేసింది.


