శిథిలాల నుంచి 8 రోజుల తర్వాత సజీవంగా.. | Venezuelan security guard pulled alive from earthquake basement rubble after 8 days | Sakshi
Sakshi News home page

శిథిలాల నుంచి 8 రోజుల తర్వాత సజీవంగా..

Jul 3 2026 5:13 AM | Updated on Jul 3 2026 5:13 AM

Venezuelan security guard pulled alive from earthquake basement rubble after 8 days

నిక్షేపంగా బయటపడిన 44 ఏళ్ల గిల్‌ ఫ్లోరెస్‌ 

వెనెజువెలాలో భూకంప బాధితుడిని సురక్షితంగా వెలికితీసిన రెస్క్యూ బృందం

లా గుయేరా: విపరీత ప్రకంపనలతో విరుచుకుపడిన భూకంపం తర్వాత మూడ్రోజులైనా శిథిలాలను పూర్తిస్థాయిలో తొలగించకపోతే వాటి కింద చిక్కుకున్న వారిపై ఆశలు వదిలేసుకోవడం తప్ప మరేం చేయలేమని రెస్క్యూ బృందాలే చెబుతుంటాయి. అలాంటిది ఏకంగా 8 రోజుల తర్వాత మృత్యువును జయించి సజీవంగా బయటపడిన వ్యక్తిని చూసి సహాయక, అన్వేషణ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. ఈ అసాధారణ ఘటనకు వెనెజువెలాలో భూకంపపీడిత లా గుయేరా నగరంలోని 9 అంతస్తుల భవన శిథిలాలు వేదికగా నిలిచాయి. భూకంపం ధాటికి 9 అంతస్తుల భవంతి 29 అడుగుల శిథిలాల కుప్పగా తయారైంది.

వీటిని నెమ్మదిగా తొలగిస్తుండగా ఐదో రోజున శిథిలాల అడుగున చేతి వేళ్లు కదులుతూ కని్పంచాయి. చిన్నపాటి రెస్క్యూ కెమెరాలో రికార్డయిన దృశ్యంతో శిథిలాల కింద ఒకరు బతికే ఉన్నారని రూఢీ చేసుకుని సహాయక బృందాలు జాగ్రత్తగా శిథిలాలను తొలగించడం మొదలెట్టారు. అయినాసరే శిథిలాలు మళ్లీమళ్లీ జారిపడుతూ రెస్క్యూ కార్యక్రమాలకు అవరోధంగా నిలిచాయి. శిథిలాలను తొలగించేలోపు అతడికి ఆహారంగా ద్రవాహారం, నీటిని సిరంజీ, సన్నటి పైప్‌ ద్వారా పంపి ఆకలిని తీర్చారు. 70 గంటలపాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతమవడంతో 44 ఏళ్ల హెర్నాన్‌ ఆల్బెర్టో గిల్‌ ఫ్లోరెస్‌ నిక్షేపంగా బయటపడ్డాడు.

అయితే అతని తలకు, ఎడమ కంటికి మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే అతడిని రెడ్‌క్రాస్‌ అంబులెన్స్‌ ఎక్కించి సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఐక్యరాజ్యసమితి విపత్తు మదింపు, సమన్వయ విభాగాధికారి సెబాస్టియన్‌ ప్రకటించారు. హెర్నాన్‌ ఆల్బెర్టో కూలిన ఆ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ పార్కింగ్‌ ఏరియాలో సెక్యూరిటీగార్డ్‌గా పనిచేసేవాడు. భర్త జాడ గల్లంతవడంతో అతను చనిపోయాడనుకుని భార్య గత వారంరోజులుగా ఏడుస్తున్నారు. భర్త బతికొచ్చేసరికి భార్య, పిల్లల ప్రాణాలు లేచొచ్చాయి.

వారం తర్వాత మా జీవితాల్లోకి ఆశాకిరణం వచి్చందని భార్య గుస్బిమార్‌ గోంజాలెస్‌ ఆనందబాష్పాలు రాల్చారు. 8 రోజుల తర్వాత వ్యక్తి నిక్షేపంగా బయటపడటంతో దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిజ్‌ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘రెస్క్యూ ఆపరేషన్‌ కోసం శ్రమను, సమయాన్ని వెచ్చిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న దేశ,విదేశాల రెస్క్యూ బృందాలకు సెల్యూట్‌’అని ఆమె కొనియాడారు. మరోవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం నాటికి భూకంప మరణాల సంఖ్య 2,295కు పెరిగింది. 11వేల మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటిదాకా శిథిలాల నుంచి 6,481 మందిని కాపాడారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement