లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహన్ వాసన్ గారిని సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యునిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ, అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో ఆయన సాధించినా విజయాలు, మరియు ఎన్నో సంవత్సరాలుగా సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలకు గాను శ్రీ వాసన్ గారిని , తమ ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డు లోకి తీసుకోవడం జరిగిందని సంస్థ అధ్యక్షులు శ్రీ బాల రెడ్డి ఇందుర్తి తెలియచేసారు.
ఈ ప్రకటనను పురస్కరించుకుని, శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు మరియు శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు, శ్రీ వాసన్ మరియు ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్ గారికి స్వాగతాభినందనలు తెలియచేసారు. 
శ్రీ లక్ష్మీ నరసింహన్ వాసన్ గారు తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.
వృత్తిపరమైన విజయాలతో పాటు, శ్రీ వాసన్ గారికి క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారదేశంలో జరిగిని వివిధ క్రికెట్ మ్యాచ్లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.
శ్రీ వాసన్ గారు 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్.డి. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.

దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన శ్రీ వాసన్ గారు, భారతదేశం మరియు అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవైఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్ మరియు సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.
శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు మరియు అధ్యక్ష ఎమిరిటస్ శ్రీ ఎస్. వి. ఆచార్య గారు, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్ గారు, శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి గారు, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి గారు, డాక్టర్ రాజ్ మోదీ గారు, డాక్టర్ కిశోర్ చివుకుల గారు, శ్రీ ఉదయ భాస్కర్ గంటి గారు, శ్రీ శ్యామ్ అప్పలి గారు, శ్రీ మూర్తి రేకపల్లి గారు, శ్రీ వంశీకృష్ణ ఏరువరం మరియు డాక్టర్ రెడ్డి ఊరిమిండి గారు, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను మరియు సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారి నిరంతర సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.


