పగలంతా సూర్యకాంతి.. రాత్రయితే చీకటి. ఇదీ ప్రకృతి ధర్మం. అయితే దీన్ని మార్చేస్తా అంటోంది రిఫ్లెక్ట్ ఆర్బిటల్. రాత్రిళ్లు కూడా సూర్యుళ్లను వెలిగిస్తాను అంటోంది. రాత్రిపూట సూర్యుడేంటి అని ఆశ్చర్యపోవద్దు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రతిపాదిస్తున్నది నేరుగా సూర్యుడిని రాత్రిపూట వెలిగే చేస్తానని కాదు. భూమి చుట్టూ భారీ అద్దాలు అమర్చి ఎక్కడ కావాలంటే అక్కడ సూర్యుడి వెలుగు ప్రతిఫలించేలా చేస్తానూ అని.
నిజానికి ఏడాది క్రితం ఇదే ఐడియాతో కంపెనీ ఏర్పాటైంది కానీ తాజాగా అమెరికా సమాచార, ప్రసార విభాగం ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పచ్చజెండా ఊపడంతో కంపెనీ ఆలోచన మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఈ కంపెనీ ప్రణాళిక ఏమిటి? లాభాలున్నాయా? అల్యూమినియం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ లోహాన్ని ఫుడ్ ప్యాకేజింగ్ మొదలు చాలాచోట్ల వాడుతూంటారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కూడా అత్యంత పలుచటి అల్యూమినియం పొరలనే అద్దాలుగా మార్చి భూమి చుట్టూ పెడతానని చెబుతోంది. కాకపోతే ఒక్కో అద్దం అరవై అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉంటుంది.
భూమికి సుమారు 680 కిలోమీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ముందుగా ఎరిన్డిల్–1 పేరుతో తయారు చేసిన ఒక ఉపగ్రహం ద్వారా ఒక్క అద్దాన్ని అక్కడి వరకూ పంపించి పరీక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాత 2035 నాటికల్లా దశలవారీగా భూమి చుట్టూ కనీసం 50 వేల అద్దాలు ఏర్పాటు తిరిగేలా చేస్తారు. ఒక్కో అద్దం భూమివైపునకు మళ్లితే ఐదు చదరపు కిలోమీటర్ల మేర వెలుగులు నిండుతాయి. పోలిక కావాలంటే... హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దాదాపు 2,300 ఎకరాలు ఉంటుంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అద్దం ఒకటి దీంట్లో సగం ప్రాంతాన్ని వెలుగుతో నింపేయగలదు.
ఉపయోగాలేమిటి?
కంపెనీ చెబుతున్నదాని ప్రకారం బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యుడి వెలుగు రాత్రిళ్లు కూడా అందుబాటులోకి వస్తే పంటలు డబుల్ స్పీడ్తో ఎదుగుతాయి. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చోట జనరేటర్ల అవసరం లేకుండా రాత్రిళ్లూ పనులు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టవచ్చు. విలువైన ప్రాణాలు కాపాడవచ్చు.
ఏ అద్దాన్ని ఎటు మళ్లిస్తే ఎక్కడ వెలుగులు పడతాయో లెక్కేసేందుకు కంప్యూటర్లు సరిపోతాయి. ఐడియా బాగానే ఉంది కానీ దీనిపై ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. 1990లలో రష్యా జన్మయా పేరుతో ఇలాంటి ప్రాజెక్టే ఒకటి చేపట్టి విఫలమైంది. అల్యూమినియం పొరలు అంతరిక్షంలో సర్రున చిరిగిపోయాయట. పైగా విశాల విశ్వాన్ని, అంతరిక్షాన్ని మధించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలకు ఈ ప్రకాశాలు పెద్ద అడ్డంకి. గాల్లో ఎగురుతూండగా అకస్మాత్తుగా వచ్చిపడే ప్రకాశం వల్ల తాము గందరగోళానికి గురవుతామని విమానాల పైలెట్లు కూడా హెచ్చరిస్తున్నారు. పక్షులు, ఇతర జీవజాతుల పరిస్థితి ఏమిటన్నది పర్యావరణవేత్తల ఆందోళన. అద్దాలను ఎటు కావాలంటే అటు తిప్పేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ సమస్యలే కావన్నది కంపెనీ వాదన. చూద్దాం ఏమవుతుందో?!
– సాక్షి, నేషనల్ డెస్క్


