కాళేశ్వరం.. కూలేశ్వరం ఎందుకయ్యింది?: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Fires On Brs Leaders | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం.. కూలేశ్వరం ఎందుకయ్యింది?: సీఎం రేవంత్‌

Jul 11 2026 7:20 PM | Updated on Jul 11 2026 7:36 PM

Cm Revanth Reddy Fires On Brs Leaders

సాక్షి, హైదరాబాద్‌: కిలాడీ కమిటీ మాపై ఒత్తిడి తెచ్చి ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కిలాడీ కమిటీతో తమకు పని లేదని.. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు పనిచేస్తామన్నారు. కేసీఆర్‌తో తప్పుడు పనులు చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్లు కొల్లగొట్టారంటూ విమర్శలు గుప్పించిన  రేవంత్‌.. కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకు అయ్యింది? లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయంటూ దుయ్యబట్టారు.

‘‘ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో నీళ్లు ఎత్తిపోయాలి. కాళేశ్వరానికి శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ, మేడిగడ్డ వెన్నుపూస కన్నెపల్లి దగ్గర గేట్లు ఎత్తడానికి అవకాశమే లేదు. జూన్‌ 13, 2026న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తూ ఆరుగురితో కమిటీ వేశారు. జూన్‌ 30, 2026న కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక నిపుణులతో సూచన చేశారు’’ అని రేవంత్‌  చెప్పుకొచ్చారు.

‘‘కేసీఆర్ ఏర్పాటు చేసిన కమిటీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈటల ఉన్నారు. కాళేశ్వరం కమిషన్‌లు తిన్న కొందరు రిటైర్డ్ ఇంజనీర్‌లే ఇప్పుడు నీరు ఎత్తిపోయాలని సూచించడం హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి చెప్పింది నిజం కాదా? కేసీఆర్ కీలాడి కమిటీలో చేరొద్దని ఈటలను కోరుతున్నా. హరీష్‌రావును కేసీఆర్ నమ్మకనే రెండో ప్రభుత్వంలో హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు.

నిన్ను మీ మామే నమ్మలేదు. కమిషన్ల దోపిడీకి హరీష్‌రావు పాల్పడుతున్నాడు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు దోచుకుంటున్నాయని మాట్లాడిన హరీష్ రావు... ఇప్పుడు ఆ కాలేజీలకు పాలు పొస్తున్నాడు. ఈటల రాజేందర్ మీరు తక్షణమే ఎన్‌డీఎస్‌ఏ  దగ్గరకు వెళ్లి.. నీళ్లు ఎత్తిపోయాలని కోరండి. ప్రాజెక్టు గేట్లు మూస్తే గ్రామాలకు గ్రామాలకు కొట్టుకుపోతాయి. మీరు పదేళ్లు ఉద్దరిస్తేనే కాళేశ్వరం కూలింది.. ఇప్పుడు ఇంకేంచేస్తారు?. నీళ్లు ఎత్తిపోస్తామంటే ఎన్డీఎస్‌ఏకు ప్రాజెక్టు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏపీ పట్టిసీమ కట్టింది. అప్పుడు హరీష్‌రావు ఏం చేస్తున్నారు?’’ అంటూ రేవంత్‌ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement