సంగారెడ్డి జిల్లా: జోగిపేట పట్టణంలో బీఫ్, మటన్ దుకాణాల ఏర్పాటు వ్యవహారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. అందోల్ ప్రాంతానికి చెందిన కటికే ముస్లింలు, జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య దుకాణాల ఏర్పాటు, వ్యాపార ఆధిపత్యం అంశంపై కొద్ది రోజులుగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
శనివారం ఈ వివాదం మరోసారి చెలరేగింది. తొలుత ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కొద్దిసేపటికే అది హింసాత్మకంగా మారింది. పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవడంతో జోగిపేటకు చెందిన పలువురు ముస్లిం యువకులు, వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఘటన అక్కడితో ఆగలేదు. ఘర్షణలో గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, కక్ష ముదిరిన అందోల్ కటికే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆసుపత్రి ప్రహరీలోకి కూడా చొరబడ్డారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులపై, వారికి అండగా ఉన్నవారిపై రెండోసారి విరుచుకుపడి దాడికి తెగబడ్డారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది, రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి, ఘర్షణ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అనంతరం పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.


