విశాఖ: ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారుల బోటు ప్రమాదానికి గురై గల్లంతైతే ప్రభుత్వం మాత్రం సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ను మధ్యలోనే నిలిపివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. ఇంకా తమ వారు వస్తారని బాధిత మత్స్యకార కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధిత మత్స్యకార కుటుంబాలను కలిసి, వారికి ధైర్యం చెప్పామన్నారు కురసాల కన్నబాబు.
‘వైఎస్ జగన్ ఆదేశాలతో మత్స్యకారులను కలిశాం. వారికి ధైర్యం చెప్పాం. ఇంకా గల్లంతైన మత్స్యకారులు వస్తారని వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మానవత్వం లేని ప్రభుత్వం అధికారంలో ఉంది. సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టలేదు. మత్స్యకారులను పరామర్శించాలని ఆలోచన సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితా, అచ్చం నాయుడులలో లేదు. విశాఖలో భూములను దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మత్స్యకారుల మీద లేదు
2023 లో ప్రమాదం జరిగి బోట్లు తగలబడితే 48 గంటల్లో జగన్ పరిహారం ఇచ్చారు. ప్రస్తుత ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కారె చిన్నకు బోటు పోయింది. ఒక్క రూపాయి పరిహారం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వైఎస్ జగన్ బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు’ అని స్పష్టం చేశారు.


